కాంగ్రెస్ పార్టీ ‘మేధోమథన సదస్సు’ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పార్టీ ‘మేధోమథన సదస్సు’

Published Sat, Aug 23 2014 11:26 PM

కాంగ్రెస్ పార్టీ ‘మేధోమథన సదస్సు’ - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలో పార్టీ పూర్వవైభవం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ‘మేధోమథన సదస్సు’ నిర్వహిస్తోంది. ఇబ్రహీంపట్నం మండలం శ్రీ ఇందూకాలేజీలో జరిగే ఈ సదస్సుకు అతిరథమహారథులు హాజరవుతున్నారు. కేంద్రం, రాష్ర్టంలో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ పార్టీ.. ఓట మికి దారితీసిన పరిస్థితులను ఈ సమావేశంలో సమీక్షించనుంది. రెండు రోజుల ఈ సదస్సులో పది అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.
 
గ్రూపుల వారీగా చర్చించడం ద్వారా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికకు తుదిరూపు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మండల/బ్లాక్/ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఇటీవల ఎన్నికల్లో గె లుపొందిన, ఓడిపోయిన అభ్యర్థులుసహా టీపీసీసీ కార్యవర్గం, అనుబంధ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దాదాపు 1300 మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు దానం నాగేందర్, క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి భారీ ఏర్పాట్లు చేశారు.
 
కళాశాల ఆవరణను పార్టీ తోరణాలతో, బెలూన్లతో అలంకరించిన  కాంగ్రెస్ శ్రేణులు.. ఇప్పటికే సభా ప్రాంగణాన్ని అందం గా ముస్తాబు చేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి జరుగుతున్న ప్లీనరీ ఏర్పాట్లను శనివారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ కొప్పుల రాజు, ఏఐసీసీ ప్రతినిధి కుంతియా, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పరిశీలించారు.
 
తప్పులను సమీక్షిస్తాం: దిగ్విజయ్
ఇటీవల ఓట మికి కారణమైన అంశాలను సదస్సులో సమీక్షిస్తామని దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని, భవిష్యత్తులో తప్పులు పునరావృతంగాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నైరాశ్యంలో ఉన్న కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేందుకు మేధోమథన సదస్సు దోహపడుతుందని, అందుకనుగుణంగా పలు అంశాలపై తీర్మానాలను చేయనున్నట్లు వెల్లడించారు.
 
అగ్రనేతల రాక!
రెండు రోజుల సదస్సుకు కాంగ్రెస్ ముఖ్యనేతలు తరలిరానున్నారు. సిద్దిరామయ్య, గులాం నబీ అజాద్, సచిన్‌పెలైట్, జ్యోతిరాదిత్య సిందియా, జైరాం రమేశ్ తదితరులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపారు. పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పర్యటనల షెడ్యూల్‌ను మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలిసింది.
 
వచ్చేనెల 21న ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సదస్సు
హైదరాబాద్: ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21న సదస్సు నిర్వహించనున్నట్టు విరసం నేత వరవరరావు తెలిపారు. శనివారం హైదర్‌గూడలోని ఎస్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్ల ఐక్య విప్లవ ఉద్యమానికి జేజేలు పలుకుతూ ఈ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. కమ్యూనిస్టు నేత ఎంటీ ఖాన్‌కు ఈ సందర్భంగా నివాళులర్పిస్తామన్నారు. విప్లవంలో మూడు మూలిక నిర్మాణాలు, ఈ దశాబ్ది విప్లవ పోరాటాలు, విప్లవోద్యమం-బోల్షివీకరణ అనే అంశాలపై వక్తలు పాణీ, అమిత్ భట్టాచార్య, సీఎస్‌ఆర్ ప్రసాద్ ప్రసంగిస్తారని చెప్పారు.

Advertisement
Advertisement