సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈ రోజు కొత్తగా 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం సాయంత్రం వైద్యఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత రెండు మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం కాస్త ఊరట చెందింది. అయితే గురువారం ఒక్క రోజే 22 కొత్త కేసులు నమోదుకావడం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. ఈ కొత్త కేసులతో కలుపుకొని తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1033కు చేరుకుంది.
కాగా ఈ రోజు ముగ్గురు కరోనాతో మరణించడంతో, తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 28కి చేరుకుంది. గురువారం కరోనా నుంచి పూర్తిగా కోలుకుని 33 మంది గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ 33 మందితో కలిసి ఇప్పటివరకు కరోనా సోకి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 442గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టీవ్గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 568కి చేరాయి.