స్టాండింగ్ కమిటీకి గ్రీన్‌సిగ్నల్ | Sakshi
Sakshi News home page

స్టాండింగ్ కమిటీకి గ్రీన్‌సిగ్నల్

Published Fri, Apr 8 2016 2:54 AM

స్టాండింగ్ కమిటీకి గ్రీన్‌సిగ్నల్

రెండేళ్లకు మోక్షం కార్పొరేషన్లలో ఎన్నికల సందడి
 
 
 కరీంనగర్ కార్పొరేషన్ :
ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న స్టాండింగ్ కమిటీల ఎన్నికకు ఎట్టకేలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మూడు నెలల్లోగా కమిటీలు ఏర్పాటు చేయూలని అధికారులను ఆదేశించింది. ఈమేరకు జీవో నంబర్ 88 ద్వారా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో మరోమారు ఎన్నికల సందడి మొదలుకానుంది. ఇన్నాళ్లు పెండింగ్ అప్రూవల్స్‌తో నత్తనడకన నడిచిన అభివృద్ధి పనులు ఇక నుంచి పరుగెత్తనున్నాయి.

 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక స్థానిక సంస్థల్లో స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయలేదు. ఇన్నాళ్లు సర్వసభ్య సమావేశాలు నిర్వహించలేక, పెండింగ్ అప్రూవల్స్‌తోనే పాలకవర్గాలు కాలం వెళ్లదీస్తున్నారుు. కొన్నిసార్లు కౌన్సిల్ ఆమోదానికి ఆరునెలల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితులు. గతంలో స్టాండింగ్ కమిటీలు ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకోసారి సమావేశమయ్యే వీలుండేది. కానీ రెండేళ్లుగా స్టాండింగ్ కమిటీలు లేకపోవడంతో ఎజెండాలో వందల సంఖ్యలో అంశాలు చేర్చాల్సి వస్తుంది. దీంతో కౌన్సిల్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏ అంశంపై పూర్తిస్థాయి చర్చ జరిగిన సందర్భాలు లేవు.

ఇలాంటి పరిస్థితుల్లో స్టాండింగ్ కమిటీల నియామకానికి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని పాలకవర్గాలు ఎదురుచూస్తున్నాయి. స్టాండింగ్ కమిటీలో ప్రతి 10 డివిజన్లకు ఒక సభ్యుడిని ఎన్నుకుంటారు. కార్పొరేటర్లుగా గెలుపొందిన సభ్యుల నుం చే నియమిస్తారు. వార్డులు, డివిజన్ల లెక్కన కాకుండా మున్సిపాలిటీని యూనిట్‌గా తీసుకుని నియమిస్తారు. ఏ డివిజన్ నుంచైనా కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యే అవకాశముంటుంది. వరుస 10 డివిజన్ల నుంచి కూడా ఇద్దరు ముగ్గురు ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంది.


 అభివృద్ధి పనులకు ఆటంకాలుండవు
ప్రస్తుతం ఏ అభివృద్ధి పని చేపట్టాలన్నా పెండింగ్ అప్రూవల్‌గా తీసుకుని టెండర్లు నిర్వహిస్తున్నారు. తర్వాత కౌన్సిల్ సమావేశంలో అప్రూవల్ తీసుకుంటున్నారు. ఒక్కోసారి బిల్లుల చెల్లింపులు కూడా పూర్తయి అప్రూవల్ తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో కౌన్సిల్ చర్చకు వచ్చినా నిష్ర్పయోజనమే అవుతుంది. బిల్లులు చెల్లించాక ఈ అంశాలపై చర్చించే అవకాశమే ఉండదు. అదే స్టాండింగ్ కమిటీ ఉంటే ప్రతి 10 అంశాలకు ఒకసారి సమావేశమయ్యే అవకాశం ఉంటుంది. అత్యవసర సమావేశం ద్వారా తీర్మానించుకోవచ్చు. స్టాండింగ్ కమిటీ లేకపోవడంతో ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు. దీంతో అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రభుత్వం స్టాండింగ్ కమిటీల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల్లో జాప్యం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement