కేసీఆర్‌ ఖబడ్దార్‌.. | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ఖబడ్దార్‌..

Published Tue, Mar 7 2017 5:09 AM

CPM Leader Tammineni Veerabhadram Fires on CM KCR

పెద్దఅడిశర్లపల్లి/కొండమల్లేపల్లి : మాయ మాటలు మాని.. మాటల గారడీకి అడ్డుకట్ట వేసి.. సామాజిక న్యాయం చేయకపోతే కేసీఆర్‌ ఖబడ్దార్‌ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర సోమవారం పెద్దఅడిశర్లపల్లి, కొండమల్లేపల్లి మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో  తమ్మినేని వీరభద్రం మాటాడారు.  ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ ప్రాంతంలో యురేనియం ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు సీపీఎం వ్యతిరేకమన్నారు.

 స్థానికంగా శీతల గిడ్డంగులు, బస్టాండ్, శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడంతో పాటు దళితులకు మూడు ఎకరాల భూమి, ఏఎమ్మార్పీ కింద పునరావాస ప్యాకేజీలు అందించాలని డిమాం డ్‌ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదన్నారు. సమాజంలో 93 శాతం ఉన్న ప్రజలను కాదని కేవలం 7 శాతం ఉన్న అగ్రవర్ణాల చేతుల్లోనే పాలన ఉండడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.9800కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను దారి మళ్లించి ఇందులో రూ.7800 కోట్లు మిషన్‌ భగీరథ కోసం కాంట్రాక్టర్లకు ఇచ్చారని అన్నారు.

 కేసీఆర్‌ ప్రభుత్వం పరిపాలన పరంగా ప్రజలను దగా చేస్తోందన్నారు.  ప్రజలను చైతన్యం చేస్తూ సీపీఎం నిరంతరం సామాజిక ఉద్యమాలు చేపడుతుందని, ఈ ఉద్యమాల్లో అన్ని పార్టీలను భాగస్వాములను చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నప్పటికీ పేదల బతుకులు మారలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  సమన్యాయం జరిగినప్పుడే తెలం గాణ అభివృద్ధి సాధిస్తుందన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిగొర్ల నాగరాజు గొర్రె పిల్లను తమ్మినేనికి బహూకరించారు.  మహాజన పాదయాత్రకు సీపీఐ నాయకులు సంఘీభావం తెలిపారు.

 సీపీఎం నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర బృందం సభ్యులు జాన్‌వెస్లీ, ఎస్‌. రమా, ఎంవీ. రమణ, ఎండీ. అబ్బాస్, పైళ్ల ఆశయ్య, శోభన్‌నాయక్, నాగేశ్, రాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, కంబాలపల్లి ఆనంద్, లక్ష్మీనారాయణ, వంగూరి రాములు, నారి అయిలయ్య, పున్‌రెడ్డి నాగిరెడ్డి, పెరికె విజయ్‌కుమార్, కావలి కృష్ణయ్య, మద్దిమడుగు శ్రీనివాస్, అంజిరెడ్డి, లక్ష్మయ్య, వస్కుల భిక్షమయ్య, శంకర్, మహేశ్‌ తదితరులున్నారు. ఈ పాదయాత్రకు సీపీఐ, టీడీపీ, ఎమ్మార్పీఎస్, అంబేద్కర్‌ సంఘం మద్దతు తెలిపారు. కొండమల్లేపల్లిలో కాంగ్రెస్‌ నాయకులు జగన్‌లాల్, సీపీఐ నాయకులు పల్లా నర్సింహారెడ్డి, సీపీఎం నాయకులు సత్యనారాయణరెడ్డి, వంగూరి వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, మురళీకృష్ణ, జగన్, సీపీఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement