‘అక్రమార్కుల’పై క్రిమినల్ కేసులు | Sakshi
Sakshi News home page

‘అక్రమార్కుల’పై క్రిమినల్ కేసులు

Published Fri, Apr 17 2015 12:20 AM

criminal cases on illegality

- సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి.
కుల్కచర్ల:‘ఇందిరమ్మ’ ఇళ్ల బిల్లులలో అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీబీసీఐడీ డీఎస్సీ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో సీబీసీఐడీ అధికారులు ఇందిరమ్మ ఇళ్లపై ఆరోసారి విచారణ చేపట్టారు. గ్రామానికి రెండో విడతలో 524 ఇళ్లు మంజూరయ్యాయి.

అందులో 92 మంది లద్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. దీంతో అవి నాన్‌స్టాటేడ్ కింద రద్దయ్యాయి. 374 ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో అధికారులు బిల్లులు మంజూరు చేశారు. మిగితావి వివిధ స్థాయిలలో ఉన్నాయి. ఇప్పటివరకు సీబీసీఐడీ అధికారులు ఐదుసార్లు విచారణ చేశారు. గురువారం మరోమారు విచారణ చేపట్టారు. ఇందిరమ్మ పథకంలో గ్రామంలో ఎంతమంది బిల్లులు తీసుకున్నారనే విషయం ఆరా తీశారు.

బిల్లులు తీసుకున్నవారు ఇళ్లు కట్టుకున్నారా..? లేదా అని విచారణ జరిపారు. బిల్లులు తీసుకున్నవారిలో చాలామంది స్థానికంగా ఉండడం లేదు. దీంతో గ్రామంలో లేనివారి పేర్లమీద బిల్లులు తీసుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో సీబీసీఐడీ అధికారులు కుల్కచర్ల స్టేట్ బ్యాంకుకు వెళ్లి విచారణ చేశారు. బిళ్లులు తీసుకున్న వారి ఖాతాలను తనిఖీ చేశారు.

కొందరు లబ్ధిదారులకు సంబంధం లేకుండా బిల్లులు డ్రా చేసుకున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు ఆధార్‌కార్డులు లేకుండా బిల్లులు తీసుక్నువారి వివరాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 40 మంది వరకు అక్రమంగా బిల్లులు తీసుకున్నట్లు విచారణలో తేలిందని, ఈవిషయమై ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు. అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సీబీసీఐడీ అధికారులు, గృహనిర్మాణ శాఖ అధికారులు ఉన్నారు.
 

Advertisement
Advertisement