ఇక సైబర్‌ నేరాల ఆటకట్టు... | Sakshi
Sakshi News home page

ఇక సైబర్‌ నేరాల ఆటకట్టు...

Published Sun, Feb 18 2018 4:00 AM

Cyber crime unit in every district - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెరిగిపోతున్న టెక్నాలజీకి తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు విజృంభిస్తున్నాయి. ఏటా సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వీటి నియంత్రణకు పోలీస్‌ శాఖ కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు సిబ్బందికి సైబర్‌ నేరాల నియంత్రణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు మాడ్యూల్‌ను రూపొందించింది. సైబర్‌ నేరం ఎలా జరుగుతుందనే దగ్గరి నుంచి దాన్ని సృష్టిస్తున్న వారి వరకు గుర్తించేందుకు తగిన మాడ్యూల్‌ శిక్షణ ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. 

కొత్త కుర్రాళ్లు.. టెక్నాలజీ జోష్‌.. 
గతంలో పోలీస్‌ శాఖలో నియమితులైన సిబ్బందికి టెక్నాలజీపై పెద్దగా అవగాహన లేదు. దీంతో టెక్నాలజీకి తగ్గట్టుగా కొత్త సిబ్బందిని పోలీస్‌ శాఖ నియమించుకుంది. గతేడాది జరిగిన నియామకాల్లో పూర్తి స్థాయిలో టెక్నాలజీపై పట్టున్న వారిని పోలీస్‌ శాఖలోకి తీసుకువచ్చింది. దీంతో సైబర్‌ నేరాల నియంత్రణ, ప్రజలకు త్వరితగతిన సేవలించేందుకు టెక్నాలజీని అధికంగా వినియోగిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా శిక్షణ పూర్తి చేసుకున్న కొత్త కానిస్టేబుళ్లను ఈ రెండు కార్యక్రమాల కోసం ఉపయోగిస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. సైబర్‌ నేరాల నియంత్రణ శిక్షణలో భాగంగానే క్రాష్‌ కోర్సు ప్రారంభించినట్లు అకాడమీ అధికారులు ‘సాక్షి’తో తెలిపారు. 

రాష్ట్రవ్యాప్తంగా సైబర్‌ క్రైమ్‌ స్టేషన్లు 
కొత్త కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలను దృష్టిలో పెట్టుకొని సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రతీ జిల్లా పోలీస్‌ యూనిట్‌లో సైబర్‌ క్రైమ్‌ విభాగాలను తీసుకువచ్చేందుకు పోలీస్‌ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్లున్నాయి. వీటి ఆధ్వర్యంలో ప్రత్యేక సైబర్‌ సెల్‌ లేదా యూనిట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. జిల్లాల్లో జరిగే సైబర్‌ నేరాలను అక్కడికక్కడే నియంత్రించేందుకు ఈ విభాగాలు కృషి చేస్తాయని అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర పోలీస్‌ శాఖలో సీఐడీ సైబర్‌ క్రైమ్‌ యూనిట్, సిటీ, సైబరాబాద్, రాచకొండలో మాత్రమే పూర్తి స్థాయిలో సైబర్‌ క్రైమ్‌ యూనిట్లు పని చేస్తున్నాయి. మిగిలిన చోట్ల ప్రత్యేక యూనిట్లు లేకపోవడంతో సీఐడీ యూనిట్‌పై భారం పడుతోంది. జిల్లాకో సైబర్‌ ల్యాబ్‌ కూడా ఉంటే నియంత్రణకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు నిర్ణయించారు. ఇక 2016లో 513 సైబర్‌ నేరాలు నమోదు కాగా, 2017లో 1,136 నమోదయ్యాయి. ఈ 1,136 కేసుల్లో కేవలం రెండింటిలో మాత్రమే శిక్ష పడింది. మిగతా కేసుల్లో పూర్తి స్థాయి ఆధారాల సేకరణ క్లిష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే సిబ్బంది శిక్షణ, టెక్నాలజీ మెళకువలు అవసరమని పోలీస్‌ శాఖ భావిస్తోంది. 

ఇదీ ట్రైనింగ్‌ మాడ్యూల్‌.. 
ప్రతీ జిల్లాలో కొత్త కానిస్టేబుళ్లు కాకుండా మిగతా సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు మాడ్యూల్‌ తయారుచేశారు. అందులో కంప్యూటర్‌ృవైరస్, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, సైబర్‌ సెక్యూరిటీ చాలెంజెస్, రిస్క్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ పాలసీ యాక్ట్, కమ్యూనికేషన్‌ వ్యవస్థ, ఇంటర్‌నెట్‌ డేటా సెంటర్, నెట్‌ వర్కింగ్‌ వ్యవస్థ, నేషనల్‌ నాలెడ్జ్‌ నెట్‌వర్క్, ఇన్ఫర్మేషన్‌ ఆడిటింగ్‌ృకంప్లైన్స్, ఐవోటీ, క్లిష్టమైన వెబ్‌ అప్లికేషన్స్, సెక్యూరిటీ రిస్క్స్, మొబైల్‌ అప్లికేషన్స్‌ృసెక్యూరిటీ, సోషల్‌ మీడియా ఇన్‌ ఈృగవర్నెన్స్, ఇన్సిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ తదితరాలపై 2 వారాలపాటు శిక్షణ ఇవ్వనున్నారు.

Advertisement
Advertisement