హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కారు షరతుల ప్రభుత్వంగా మారిందని మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మంగళవారం హైదరాబాద్లో ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి రూ. లక్ష కట్టాలని షరతు విధించటం సరికాదన్నారు. పేదలు రూ. లక్ష కట్టలేకపోతే డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని అమలు చేయరా అని ఆమె కేసీఆర్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ పధకాన్ని ఆటకెక్కించే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ విధంగా షరతులు విధిస్తోందని డీకే అరుణ అరోపించారు.
కాంగ్రెస్ హయాంలో మంజూరైన బిల్లులను కూడా పెండింగ్లో పెట్టి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వాణిజ్యపన్నుల శాఖ మంత్రి టి.శ్రీనివాసయాదవ్ తన రాజీనామాను ఆమోదింప చేసుకోవాలని ఆయనకు హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఒరవడి ఉండాలంటున్న సీఎం కేసీఆర్... తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదింప చేసి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలని ఆయనకు డీకే అరుణ హితవు పలికారు.