సాగు.. ఇక బహుబాగు | Sakshi
Sakshi News home page

సాగు.. ఇక బహుబాగు

Published Sun, Nov 23 2014 12:31 AM

సాగు.. ఇక బహుబాగు

గజ్వేల్: వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆరునెలలుగా ఈ పథకం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరట దొరికింది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఈ పథకాన్ని  పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈమేరకు కొత్త మార్గదర్శకాలను రూపొందించి జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.

 ఎట్టకేలకు ఉత్తర్వులు జారీ
 వ్యవసాయరంగంలో యాంత్రికీకరణ కీలకంగా మారింది. ప్రతి ఏటా జిల్లాలో 6 లక్షల హెక్టార్లకుపైగా వివిధ పంటలు సాగవుతున్నాయి. పురాతన పద్ధతులకు క్రమంగా స్వస్తి పలుకుతున్న రైతులు, అధునాతన యంత్రాల వాడకంపై దృష్టి సారించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు ఈ విధానం అనివార్యమవుతోంది. దీంతో యాంత్రీకరణ పథకానికి మోక్షం ఎప్పుడు లభిస్తుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తాజాగా కొన్నిరోజుల క్రితం పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

 ఎంపిక ఎలా అంటే...
 కొత్తగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం యాంత్రికీకరణ పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటుచేయనున్నారు. ఈ కమిటీలో జేడీఏ, హార్టికల్చర్ అసిస్టెంట్ డెరైక్టర్, ఆత్మ పీడీ, డ్వామా పీడీ, డీఆర్‌డీఏ పీడీతో పాటు జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, నాబార్డు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీలో వ్యవసాయాధికారి, డీఆర్‌డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, డ్వామా ఏపీఓ, ఎంపీడీఓ, తహశీల్దార్లు సభ్యులుగా వ్యవహరిస్తారు. గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేసి 50 శాతం సబ్సిడీపై పరికరాలను అందించనున్నారు.

ఈసారి హార్వెస్టర్, రొటోవేటర్, శ్రీవరిసాగు యంత్రం, ట్రాక్టర్లు వంటి భారీ యంత్రాలను కూడా సబ్సిడీపై అందించడానికి ప్రభుత్వం సంకల్పించింది. రైతులు ఈ పథకానికి మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందజేస్తే మండల స్థాయి కమిటీ ద్వారా ఎంపిక ప్రక్రియ జరగనుంది. సబ్సిడీపై పరికరాలు పొంది గతంలో ఇతరులకు అమ్ముకొని యాంత్రికీకరణను అభాసుపాలు చేసిన ఘటనల నేపథ్యంలో ఈ దుస్థితిని అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం రికవరీ యాక్ట్ సైతం ప్రయోగించబోతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement