సమయం వృథా చేయొద్దు | Sakshi
Sakshi News home page

సమయం వృథా చేయొద్దు

Published Sun, Sep 28 2014 3:46 AM

Do not waste time

పోచమ్మమైదాన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ఓపీని పరీక్షించే సమయాన్ని వృథా చేయకుండా జాగ్రత్త పడాలని, లేనిపక్షంలో రోగులు బారులు తీరుతారని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ సురేష్‌చందా అన్నారు. స్థానిక కేఎంసీలో శనివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఐఎంఏ ప్రతినిధులు, కేఎంసీ ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్, వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగులకు యాంటీ బయాటిక్ మందులు రాయడం వల్ల  వ్యాధి తీవ్రత పెరుగుతుంది తప్ప తగ్గదని సూచించారు. సాధ్యమైనంత వరకు జనరిక్ మందులు రాయాలని సూచించారు. డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ కంప్యూటరైజ్ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం కేఎంసీ బాలికల హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.
 
హెల్త్ హబ్‌గా వరంగల్‌ను మార్చొచ్చు

వరంగల్‌ను హెల్త్ హబ్‌గా మార్చొచ్చని ఐఎంఏ ప్రతినిధి డాక్టర్ విజయచందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కేఎంసీ పరిధిలో 120 ఎకరాలు, సెంట్రల్ జైలు పరిధి లో 80 ఎకరాలు, ఎంజీఎం పరిధిలో 30 ఎకరాల భూ మి ఉంది. ఈ నేపథ్యంలో హెల్త్ హబ్ ఏర్పాటుకు భూ సమస్య లేదని తెలుపగా స్పందించిన  ఇన్‌చార్జ్ వీసీ ఆ విషయాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని అన్నారు.  
 
పాత బ్యాంకు భవనంలో యూనివర్సిటీ  కార్యకలాపాలు

ఎంజీఎం : హెల్త్ యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగించేందుకు పాత ఆంధ్రబ్యాంకు భవనం అనువుగా ఉంటుందని ఎంజీఎం సూపరింటెండెంట్ మనోహర్, కేఎంసీ ప్రిన్సిపాల్ రమేశ్‌కుమార్ సూచన మేరకు సురేష్‌చందా ఆ భవనాన్ని పరిశీలించారు. భవనంలో మెరుగైన సౌకర్యాలు, యూనివర్సిటీ నూతన భవన నిర్మాణాలకు సంబంధించి ప్రణాళిక తయారు చేసి హైదరాబాద్‌కు తీసుకురావాలని ఎంపీఎస్‌ఐడీసీ ఈఈని ఆదేశించారు. ఆయన వెంట దేవేందర్‌రెడ్డి, కేఎంసీ పీడీ తుమ్మ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement