జనగామ: తుది ప్రచారానికి 48 గంటలే.. | Sakshi
Sakshi News home page

జనగామ: తుది ప్రచారానికి 48 గంటలే..

Published Mon, Dec 3 2018 10:41 AM

Election Campaign closing in two days In warangal - Sakshi

సాక్షి, జనగామ:  సాధారణ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. డిసెంబర్‌ ఏడున జరుగనున్న పోలింగ్‌కు అన్ని రాజ కీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఓట్ల కోసం ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా కార్యక్రమాలతో ప్రచారం తారస్థాయికి చేరుకుంది. జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాల్లో హోరాహోరీ ప్రచారంతో అభ్యర్థులు పొలిటికల్‌ హీట్‌ పెంచారు. 

ప్రచారానికి మరో 48 గంటలే..
డిసెంబర్‌ ఏడున జరుగనున్న పోలింగ్‌కు ప్రచారం చేసుకోవడానికి అభ్యర్థులకు కేవలం 48 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈనెల ఐదో తేదీన సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవడానికి గడువు ఉంది. అభ్యర్థులకు మంగళ, బుధవారం రెండు రోజులు మాత్రమే ఓటర్లను కలుసుకునే అవకాశం ఉంది. అభ్యర్థుల తరఫున ప్రచారంతోపాటు బహిరంగ సభలు, రోడ్‌ షోలు నిర్వహిం చుకోవడానికి కూడా అంతే సమయం ఉంది. దీంతో మూడు నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
 
పదునెక్కిన ప్రచారం..
ఎన్నికలకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే మి గిలి ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని విస్తృతం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల తరఫున ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ నవంబర్‌ 19వ తేదీన పాలకుర్తి, 23న జనగామ, 26న స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వద బహిరంగసభల్లో పాల్గొని ప్రచారం చేశారు. పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాల్లో ఆపద్ధర్మ భారీనీటిపారుదల శాఖమంత్రి హరీష్‌రావు ప్రచారం నిర్వహించారు. పాలకుర్తిలో గాయని మధుప్రియ ఎర్రబెల్లి తరఫున ప్రచారం చేశారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల ప్రచార సరళితో పాటు పార్టీ కార్యక్రమాలను ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిర్వహిస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ అభ్యర్థులు మాత్రం ఒంటి చేత్తో ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు కవర్‌ అయ్యేలా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 

తుది ప్రచారానికి అగ్రనేతలు..
మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనుండడంతో జిల్లాకు అగ్రనేతలు రానున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ తరఫున కేటీఆర్, హరీష్‌రావు ప్రచారంచేసే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ తరఫున స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి రోడ్‌షోలు చేపట్టి ఓటర్లను కలవడం కోసం టూర్‌ షెడ్యూల్‌ సిద్ధం చేస్తున్నారు. అగ్రనాయకుల ప్రచార కార్యక్రమాలతో జిల్లాలో రాజకీయ సందడి నెలకొననుంది.  

Advertisement
Advertisement