అంతరిస్తున్న అటవీ సంపద | Sakshi
Sakshi News home page

అంతరిస్తున్న అటవీ సంపద

Published Tue, May 20 2014 2:33 AM

Endangered forest wealth

వినాయక్‌నగర్, న్యూస్‌లైన్:  కలప వ్యాపారుల స్వార్థానికి పచ్చని చెట్లు బలవుతున్నాయి. కలప స్మగ్లర్లు చెట్ల ను యథేచ్ఛగా నరికివేయడంతో రోజురోజు కూ అటవీ సంపద అంతరించి పోతోంది.  పెద్ద పెద్ద వృక్షాలు సైతం కనుమరుగవుతున్నాయి. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. అయినా సంబంధిత అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరి స్తున్నారు. అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందితో చేతు లు కలిపి కలప స్మగ్లర్లు టేకు, జిట్రేగి, వేప, తుమ్మ వంటి చెట్లను విచ్చలవిడిగా నరికి ప్రతి నిత్యం నగరానికి చేరవేస్తున్నారు. ‘దొరికితే దొంగలు లేకపోతే దొరలు’ అన్నట్టుగా మారింది పరిస్థితి.

 అటవీ శాఖ అధికారులు అప్పుడప్పుడు దాడులు చేసి కలపను పట్టుకున్నా, స్మగ్లర్లు మాత్రం పారి పోవడం పరిపాటుగా మారింది. పలుమార్లు రిక్షాలు,సైకిళ్లు, ఆటో లు, లారీలు అక్రమ కలపతో పట్టుబడ్డాయి. విచిత్రం గా నిందితులు మాత్రం దొరకలేదు. నగరంలో చా లా చోట్ల అక్రమంగా నిలువ ఉంచిన టేకు దుంగలు, కలప సైజులు దొరికాయి. అయినా అటవీ చట్టం కిం ద నమోదైన కేసులు మాత్రం నామమాత్రమే. అటవీ సంపదను దోచుకుంటున్న స్మగ్లర్లు అక్రమంగా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 నగరంలోని ముజాహిద్‌నగర్‌లో ఓపాత ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన రూ. 80 వేల విలువ చేసే 22 టేకు దుంగలను పక్కా సమాచారంతో పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటనలు చేశారు. కర్ర ఎవరిది, ఇల్లు ఎవరిదనే అంశాలను మాత్రం విస్మరించారు.
     గత డిసెంబరులో బోమ్మన్నాగు ప్రాంతంలో 190 అక్రమ టేకు నిల్వలను ఫ్లయింగ్‌స్క్వడ్ అధికారులు పట్టుకున్నారు. గోదాము ఎవరిదో తేలినా, యజమానిపై కేసు  మాత్రం నమోదు చేయక పోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. సరిహద్దులోని యంచ చెక్‌పోస్టు వద్ద అక్రమంగా డీసీఎం వ్యానులో తరలిస్తున్న 5 లక్షల విలువ చేసే 90 టేకు దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 {పతి నిత్యం నగరానికి కాల్పోల్ గ్రామం వైపు నుంచి రిక్షాలలో, ఆటోలలో వస్తుంది. క్షేత్రస్థాయి సిబ్బంది అనుగ్రహం లేనిదే ఈ దందా నడవదనే ఆరోపణలు ఉన్నా యి. బడాపహాడ్, లక్ష్మాపూర్ శివారు నుంచి టేకు సైజులు నగరంలోని బబస్‌సాహెబ్ పహాడ్, ధర్మపురి హిల్స్, మాలపల్లి, ముజాహిద్‌నగర్‌కు వస్తున్నట్లు సమాచారం.

 మల్కాపుర్, మల్లారం అటవీ ప్రాంతం నుంచి కూడా అక్రమ కలప నగరానికి చేరుతుందని సమాచారం. నిఘా పటిష్టంగా ఉందని సంబంధిత శాఖ అధికారులు చె బుతున్నా, స్మగ్లర్లు మాత్రం దర్జాగా కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు. మల్లారం గండి అటవీ ప్రాంతం నుంచి రోజూ తెల్లవారు జామున సైకిళ్లపై చాలా మంది వంట చెఱుకు, టేకుసైజులు తెస్తుంటారు.

 2014 మార్చి ఒకటవ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ముదక్‌పల్లి, మల్లారం, నవీపేట సెక్షన్ మంచిప్ప ప్రాంతాలలో నాగారం, పూలాంగ్ తదితర ప్రాంతాలలో నాలుగు 4 లక్షల రూపాయల విలువ చేసే టేకు దుంగలను పట్టుకున్నారు. 13 కేసులను నమోదు చేశారు. 23 నాన్‌టేకు కేసులు నమోదు చేసి 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

 ఈ దందాపైనే అధారపడి జీవిస్తున్న కుటుంబాలు నగరంలో వందల సంఖ్యలో ఉన్నాయంటే, పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అటవీదొంగల చేతులలో అడవి క్రమంగా కనుమరుగవుతున్నా ఎవ్వరికీ పట్టడం లేదు.

Advertisement
Advertisement