ప్రతి విద్యార్థికీ ఆధార్ తప్పనిసరి | Sakshi
Sakshi News home page

ప్రతి విద్యార్థికీ ఆధార్ తప్పనిసరి

Published Fri, Feb 20 2015 2:14 AM

Every student must be have Aadhar number

* విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు
* రాష్ట్రంలో అన్ని ప్రైవేటు స్కూళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే
* ఆన్‌లైన్‌లోనే కొత్త స్కూళ్ల అనుమతుల ప్రక్రియ
* వచ్చే ఏడాది అమలుకు చర్యలు

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త సర్వీసు రూల్స్ అమల్లోకి తెచ్చేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. విద్యార్థులతోపాటు ప్రైవేటు స్కూళ్లకు సంబంధించి పలు నిబంధనలను అమల్లోకి తేబోతోంది. ప్రతి విద్యార్థికి ఆధార్ నంబరు ఉండాలన్న నిబంధనను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతోపాటు వాటిల్లో చదివే విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సంక ల్పిం చింది. వచ్చే విద్యా సంవత్సరంలో (జూన్ నుంచి) వీటిని అమలు చేయాలని భావిస్తోంది. అయితే ఆన్‌లైన్‌లో నమోదు చే సే విద్యార్థుల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండవు. విద్యాశాఖ అధికారులే వాటిని చూసేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు విద్యార్థులు, టీచర్ల హాజరు వివరాలను రోజూ పాఠశాల వారీగా నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. దీనిని మొదట పట్టణ ప్రాంతాలు, తరువాత గ్రామీణ ప్రాంతాలకు విస్తరించనుంది. గురువారం జరిగిన సమీక్షలో విద్యాశాఖ ఈ అంశాలపై చర్చించింది.
 
 కొత్త నిబంధనలను కచ్చితంగా అమలు చే సేందుకు క్షేత్ర స్థాయిలో అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందున ప్రైవేటు పాఠశాలలన్నీ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న నిబంధనను విధించనుంది. గతంలో అనుమతి (రికగ్నైజేషన్) పొందిన స్కూళ్లు కూడా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకుని తమ పాఠశాలలు, విద్యార్థుల వివరాలను ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇకపై కొత్త పాఠశాలలకు అనుమతులు.. ఇతరత్రా పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టనున్నట్లు పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు.
 
 మధ్యాహ్న భోజన కార్మికుల ఖాతాల్లోకి నేరుగా వేతనాలు
 మధ్యాహ్న భోజన పథకం అమలులో కీలక మార్పులను తీసుకురాబోతోంది. ఈ పథకం పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు కంప్యూటరీకరించాలని నిర్ణయించింది. అంతేకాక స్కూళ్లలో భోజనం వండిపెట్టే కార్మికుల వేతనాలను కూడా ఆన్‌లైన్ ద్వారా నేరుగా వారీ ఖాతాల్లోనే వేయాలని నిర్ణయించించింది. అలాగే భోజనం వండిపెట్టే కార్మికులకు ప్రత్యేక ‘డ్రెస్’ను అమలు చేయనుంది.
 

Advertisement
Advertisement