జడ్చర్ల: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబ్నగర్ జిల్లాలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన సీతగారి శ్రీనివాసరెడ్డి(55) తనకున్ననాలుగెకరాలకు తోడు మూడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, వరి, టమాటా సాగు చేశాడు. సాగు, ఇంటి అవసరాల కోసం రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. అయితే, ఈ ఏడాది వర్షాభావంతో పైర్లు సరిగా ఎదగక, దిగుబడి వచ్చే జాడ కనిపించలేదు. దీంతో ఆయన తీవ్రంగా కుంగిపోయాడు.
శనివారం ఉదయం కుటుంబసభ్యులంతా పొలానికి వెళ్లగా ఇంట్లో ఒక్కడే ఉన్న శ్రీనివాసరెడ్డి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులకు శ్రీనివాసరెడ్డి విగతజీవిగా కనిపించాడు. అతనికి భార్య సువర్ణ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.