కనికరించని కాలం..కరిగిపోయెను మేఘం | Sakshi
Sakshi News home page

కనికరించని కాలం..కరిగిపోయెను మేఘం

Published Fri, Jul 25 2014 3:54 AM

farmers in concern

 కామారెడ్డి :వానలు కురిసే కార్తెలు కరిగిపోయా యి. మేఘం వర్షించకుండా తేలిపోయింది. వర్షకాలం ప్రారంభమై నెలన్నర గడిచినా.. వరుణుడు కరుణించకపోవడంతో అన్నదాత ల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. అయితే వర్షా లు కురియనందున ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారు లు సూచిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో సరైన వర్షాలు కురియకపోవడంతో ఆందోళనలో ఉన్న రైతుల్లో భరోసా కల్పించేందుకోసం, ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించేందు కోసం శుక్రవారం నుంచి గ్రామాల బాట పడుతున్నారు. కామారెడ్డి మండల వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాస్ గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రత్యామ్నాయ పంటల గురించి వివరించారు.

 ఖరీఫ్ సీజన్‌లో సరైన వర్షాలు కురియకపోవడం వల్ల ప్రత్యామ్నాయ పంటలైన కంది, ఆముదం, మినుము, పెసర వంటి పంటలు సాగు చేయాలని సూచించారు. మొక్కజొన్న వేసినా ఇబ్బందులు తప్పవన్నారు. ఒకవేళ మొక్కజొన్న పంటనే సాగు చేయాలని భావిస్తే తక్కువ కాలంలో చేతికందే విత్తనాలను ఎంచుకోవాలన్నారు. సబ్సిడీపై విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

 రైతులు బోర్లు, బావుల వద్ద వరి పంట సాగు చేయడానికి సిద్ధమైనప్పటికీ నాట్లు వేయడంలో ఆలస్యం అవుతున్నందున పంట పొట్టదశలోకి వచ్చేసరికి కరెంటు సమస్య ఎదురుకావచ్చని పేర్కొన్నారు. వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకుని కొంత ఆరుతడి పంటలు వేయాలని సూచించారు.

 రైతుల్లో కలవరం...
 వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు కలవరానికి గురవుతున్నారు. తినడానికి అవసరమైన ధాన్యమైనా పండించుకునే పరిస్థితులు లేకుండాపోయాయని ఆవేదన చెందుతున్నారు. వరుణుడు కరుణిస్తేనే తమకు మేలు జరుగుతుందంటున్నారు. ఆరుతడి పంటలు సాగు చేస్తే తినడానికి కావాల్సిన తిండిగింజలు ఎక ్కడి నుంచి తెచ్చుకునేదని ప్రశ్నిస్తున్నారు. తక్కువ కాలంలో కోతకొచ్చే వరి విత్తనాలు అందించాలని కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement