ఖాకీలు కలబడ్డారు... | Sakshi
Sakshi News home page

ఖాకీలు కలబడ్డారు...

Published Tue, Feb 10 2015 2:56 AM

fighting on Constables

వీడియో పుటేజీల్లో నిక్షిప్తం
మామూళ్ల పంపకాల్లో తేడాతో వివాదం
విచారణ జరిపిన సీఐ.. ఎస్పీకి నివేదిక


 చొప్పదండి : చొప్పదండి పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ కొట్టుకున్నారు. ఇతర పోలీసులు వారించినా వినకుండా తాగిన మైకంలో బూతులు తిట్టుకుంటూ ముష్టిఘాతాలకు దిగారు. మామూళ్ల పంపకంలో వచ్చిన తేడాతో మాటామాటా పెరిగి వివాదం స్టేషన్‌లోనే తన్నుకునే వరకు వచ్చింది. రామడుగు పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే హెడ్‌కానిస్టేబుల్ కిష్టయ్య కొన్నాళ్ల కింద చొప్పదండి స్టేషన్‌కు అటాచ్డ్‌గా వచ్చాడు. ఇక్కడే కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న భూమయ్యతో కలిసి, ఎస్సై జీపు డ్రైవర్ మల్లారెడ్డి మనుమరాలు పురుడు సందర్భంగా ఆదివారం రాత్రి ఇచ్చిన దావత్‌కు వెళ్లారు.

వీరితో మరో పోలీస్ కూడా ఉన్నాడు. ఫుల్‌గా తాగి స్టేషన్‌కు వచ్చిన కిష్టయ్య, భూమయ్యమధ్య స్టేషన్‌కు వచ్చిన మామూళ్లు పంచుకునే విషయంలో వివాదం రాజుకుంది. కిష్టయ్య రామడుగు స్టేషన్ నుంచి వచ్చాడని, అక్కడి మామూళ్లే తీసుకోవాలని భూమయ్య నిలదీయడంతో తన్నులాట వరకు వెళ్లింది. వీరి వీరంగమంతా వీడియో పుటేజీల్లో రికార్డు అయినట్లు సిబ్బంది చెబుతున్నారు. కాగా ఇరువురి ఖాకీల మధ్య జరిగిన గొడవపై సీఐ లక్ష్మీబాబు సోమవారం విచారణ జరిపారు. జరిగిన సంఘటనపై ఎస్పీ శివకుమార్‌కు నివేదిక పంపిస్తామని సీఐ చెప్పారు.
 
 

Advertisement
Advertisement