దాని కోసమే పార్టీలు మారుతున్నారు: మాజీ ఎమ్మెల్యే | Sakshi
Sakshi News home page

దాని కోసమే పార్టీలు మారుతున్నారు: మాజీ ఎమ్మెల్యే

Published Mon, Jun 17 2019 7:53 PM

Formar Congress MLA Fires On TRS government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశ చరిత్రలోనే  ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ  చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది టీఆర్‌ఎస్‌ మాత్రమేనని కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో 8792 మంది టీఆర్టీ ఉత్తీర్ణులైన విద్యార్థులు, వారి కుటుంబాలు మనోవేదనకు గురు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి దీనికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన వంశీ.. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మందికి పైగా నిరుద్యోగులు టీచర్ ఉద్యోగాల నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని గుర్తుచేశారు.

రేపు జరిగే కేబినెట్ మీటింగ్‌లో అయినా, టీఆర్టీ ఉత్తీర్ణులైన నిరుద్యోగుల ఉద్యోగాల గురించి ప్రస్తావించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే 8792 మంది కుటుంబ సభ్యులతో సహా మరోసారి ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఎంతోమంది యువత తమ ప్రాణాలు అర్పించి తెలంగాణ సాధిస్తే, నేడు రాష్ట్రం ఏర్పడినా.. ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 15620 పోస్టులకు ఖాళీలు ఏర్పడితే.. ప్రభుత్వం కేవలం 7వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్న పుట్టిన పార్టీ కాదని, వారి స్వలాభం కోసం ప్రకటనలు చేస్తూ పార్టీలు మారతున్నారని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement