ఏది చేసినా సంచలనమే | Sakshi
Sakshi News home page

ఏది చేసినా సంచలనమే

Published Thu, Aug 28 2014 1:06 AM

ఏది చేసినా సంచలనమే - Sakshi

- ఫైర్‌బ్రాండ్ జగ్గారెడ్డి రాజకీయ ప్రస్థానం
సంగారెడ్డి మున్సిపాలిటీ:రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి కేంద్ర బిందువైన మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి మరోమారు సంచలనానికి కేంద్ర బిందువయ్యారు. నిన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న జగ్గారెడ్డి రాత్రికి రాత్రే బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున మెదక్ ఎంపీ స్థానానికి పోటీలో నిలిచారు. ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన  తూర్పు జయప్రకాశ్‌రెడ్డి 1986లో సంగారెడ్డి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున 5వ వార్డు నుంచి పోటీ చేసి కౌన్సిలర్‌గా తన రాజకీయ జీవితం ప్రారంభించారు.

ఆ తర్వాత 1995లో ప్రత్యక్షంగా జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ తరఫున  పోటీ చేసి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ క్రమంలోనే 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున సంగారెడ్డి నుంచి బరిలో నిలిచి తొలిసారిగా అసెంబ్లీలో కాలుపెట్టారు.

ఆ తర్వాత కాలంలో కేసీఆర్‌తో విభేదించిన ఆయన, 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సంగారెడ్డి నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఈ క్రమంలోనే 2012లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. 2014 ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ  కాంగ్రెస్ తరఫునే సంగారెడ్డి నుంచి పోటీ చేసిన జగ్గారెడ్డి అపజయం చవిచూశారు. తాజాగా బీజేపీ, టీడీపీల ఉమ్మడి అభ్యర్థిగా మెదక్ ఎంపీ ఉప ఎన్నికల బరిలో నిలిచారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement