మళ్లీ..నాలుగు చోట్ల వాయిదా | Sakshi
Sakshi News home page

మళ్లీ..నాలుగు చోట్ల వాయిదా

Published Sun, Jul 6 2014 1:09 AM

మళ్లీ..నాలుగు చోట్ల వాయిదా - Sakshi

మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో శుక్రవారం ఆరు మండలాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆయా మండలాల్లో రెండో రోజు శనివారం నాలుగుచోట్ల (భువనగిరి, యాదగిరిగుట్ట, మునగాల, ఆత్మకూర్.ఎస్) కోరం లేక వాయిదా పడ్డాయి. మునుగోడు ఎంపీపీగా టీఆర్‌ఎస్ బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించగా, చిట్యాల ఎంపీపీ స్థానాన్ని టీఆర్‌ఎస్ దక్కించుకుంది.
 
 భువనగిరి.. మళ్లీ వాయిదా
 భువనగిరి : భువనగిరి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక రెండవ రోజైన శనివారమూ వాయిదా పడింది. శుక్రవారం కోరం లేక ఎన్నికను వాయిదా వేసిన విషయం తెలిసిందే. మొత్తం 14మంది ఎంపీటీసీలు, ఒక కోఆప్షన్ సభ్యుడు, ఎక్స్‌అఫీషియో సభ్యుడైన స్థానిక శాసనసభ్యుడు ఎన్నికకు హాజరు కావాల్సి ఉంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి 4 గంటల వరకు ఏ ఒక్క సభ్యుడూ హాజరుకాలేదు. దీంతో ఎన్నికల అధికారి దేవ్‌సింగ్ ఎన్నిక వాయిదా వే స్తున్నట్లు ప్రకటించారు. తిరిగి ఎన్నికల కమిషన్ నుంచి తేదీ వచ్చిన తర్వాత సమావేశం ఉంటుందని ఆయన చెప్పారు.  
 
 గుట్ట ఎంపీపీ ఎన్నిక నిరవధిక వాయిదా
 యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట ఎంపీపీ ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. 4వ తేదీన ఎన్నిక జరగకపోతే మరునాడే ఉంటుందని ప్రకటించిన అధికారులు గుట్టలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల మూలంగా శనివారం కూడా సమావేశం జరపకుండా నిరవధికంగా వాయిదా వేశారు. తదుపరి సమావేశం తేదిని నిర్ణయించేది రాష్ట్ర ఎన్నికల కమిషనేనని ఎన్నికల అధికారి డాక్టర్ అప్పారావు తెలిపారు. 4న టీఆర్‌ఎస్‌కు చెందిన 8మంది, ఒక స్వతంత్ర ఎంపీటీసీ సమావేశానికి హాజరుకాలేదు. కాంగ్రెస్ ఎంపీటీసీలు ఆరుగురు, మరో స్వతంత్ర అభ్యర్థి మాత్రమే హాజరయ్యారు. కోరం లేకపోవడంతో వాయిదా వేశారు. కోరం ఉండి కోఆప్షన్ సభ్యుడిని ఎన్నుకుంటే ఎంపీపీ ఎన్నిక వాయిదాపడినా మరునాడే జరుపుతారు. కానీ కోఆప్షన్ సభ్యుడి ఎంపిక జరగకపోవడంతో సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.  
 
 తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఎంపీపీ ఎన్నిక
 చిట్యాల : చిట్యాల మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక శనివారం తీవ్ర ఉద్రిక్తతల నడమ నిర్వహించారు. ఎంపీపీగా టీఆర్‌ఎస్‌కు చెందిన బట్టు అరుణ ఎన్నికయ్యారు. శుక్రవారం కోరం లేక వాయిదా పడిన ఎంపీపీ ఎన్నిక శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైంది. అంతకుముందు క్యాంపునకు వెళ్లిన కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు పోలీసు బందోబస్తుతో నల్లగొండ నుంచి చిట్యాలకు వాహనాలలో బయలుదేరారు. చిట్యాలలో ఉరుమడ్ల రోడ్డులోని ఎంపీడీఓ కార్యాలయానికి సమీపంలోకి రాగానే టీడీపీ, టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఎంపీటీసీ సభ్యులు వస్తున్న బస్సుపై కొందరు రాళ్లతో దాడిచేసేందుకు ప్రయత్నించారు.
 
 పోలీసులు అడ్డుకుని లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఆనంతరం ఆ ఎంపీటీసీ సభ్యులు నిర్ణీత ఎన్నిక సమయానికి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తం 16 మంది ఎంపీటీసీ సభ్యులు కాగా, బస్సులోని ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు హాజరుకాగా, సీపీఎంకు చెందిన ఇద్దరు గైర్హాజరయ్యారు. అప్పటికే అదే గదిలో ఉన్న టీఆర్‌ఎస్, టీడీపీ సభ్యులు ఆరుగురు పక్క గదిలోకి వెళ్లారు. కాంగ్రెస్‌కు చెందిన మరో ఇద్దరు సభ్యులు రాకపోవడంతో కోరం లేక అధికారులు ఎన్నికను ప్రారంభించలేదు. ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేతోపాటు మరికొందరు కార్యాలయంలోకి రావడంతో పోలీసులు మరోసారి లాఠీచార్జ్ చేశారు. ఈ లాఠీచార్జ్‌లో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.
 
 భువనగిరి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రాజేశ్వరావులతో ఎమ్మెల్యే వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సమావేశ గదికి చేరుకుని ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులను కోరారు. టీఆర్‌ఎస్, టీడీపీలకు చెందిన ఆరుగురు ఎంపీటీసీలకు తోడు కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎంపీటీసీలు పాల్గొనడంతో అధికారులు ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. దీంతో టీఆర్‌ఎస్‌కు చెందిన వనిపాకల ఎంపీటీసీ సభ్యురాలు బట్టు అరుణను ఎంపీపీగా పెద్దకాపర్తి ఎంపీటీసీ సభ్యురాలు ఓర్సు లక్ష్మమ్మ ప్రతిపాదించగా ఉరుమడ్ల ఎంపీటీసీ సభ్యుడుఅబ్బయ్య బలపర్చారు. బరిలో ఎవరూలేకపోవడంతో ఆమె ఎంపీపీ ఎన్నికైనట్టు ప్రకటించారు  వైస్ ఎంపీపీగా టీడీపీకి చెందిన మల్లేష్ ఎన్నికయ్యారు.
 

Advertisement
Advertisement