హైదరాబాద్: బాలికలపై, మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా కేపీహెచ్బీ ఓ ప్రైవేటు స్కూల్ లో శుక్రవారం ఉదయం నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థినితో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తప్పించుకున్న బాలిక తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పడంతో వారు స్కూల్కు వచ్చి అతనికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. కేపీహెచ్బీ ప్రాంతానికి చెందిన బాధిత విద్యార్థిని స్థానికంగా ఉండే ప్రైవేటు స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది.
అదే స్కూల్కు చెందిన బస్ క్లీనర్ జి.గణేష్ గత కొన్ని రోజులుగా విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి చిన్న విషయాలను ప్రిన్సిపల్కు చెప్పరాదని ఆమెను బెదిరిస్తువస్తున్నాడు. శుక్రవారం స్కూల్కు వచ్చిన ఆ చిన్నారిని సంతకం పెట్టడం కోసమని ఓ గదిలోకి తీసుకెళ్లి ముద్దుపెట్టుకోవడంతో పాటు అత్యాచారం చేయబోయాడు. అతడి బారి నుంచి తప్పించుకుని బయటకు వచ్చిన విద్యార్థిని ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది.
దీంతో విద్యార్థిని తల్లిద్రండులు, బంధువులు పలు విద్యార్థి సంఘాల నేతలతో కలసి వెంటనే స్కూల్కు వచ్చారు. క్లీనర్ గణేష్ ను పట్టుకుని చితకబాది కేపీహెచ్బీ పోలీసులకు అప్పగించారు. స్కూల్లో విద్యార్థినులకు రక్షణ కల్పించడంలో విఫలమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినా పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.