మహిళలపై అకృత్యాలను సహించేది లేదు | Sakshi
Sakshi News home page

మహిళలపై అకృత్యాలను సహించేది లేదు

Published Wed, Aug 8 2018 5:09 PM

Governor Narasimhan Serious On Woman Assaults In Universities - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మహిళలపై ఏ చిన్న అకృత్యం చోటుచేసుకున్నా సహించేది లేదని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ స్పష్టం చేశారు. బుధవారం అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీలో గవర్నర్‌ నరసింహన్‌ అధ్యక్షతన వీసీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్శిటీల్లో మహిళలు, విద్యార్ధినిల భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గత అక్టోబర్‌లో జరిగిన సమావేశంలో విశ్వవిద్యాలయాల్లో చేపట్టాల్సిన కార్కక్రమాల గురించి వివరించామన్నారు. బయోమెట్రిక్‌తో పాటు, అన్ని యూనివర్శిటీల్లో ఒకే అకాడమిక్‌ క్యాలెండర్‌ పాటించాలన్నారు.

ఉపాధి అవకాశాలు ఉండే కోర్సులు రూపొందించి, ఉపాధి అవకాశాలు లేని కోర్సులు తొలగించడానికి చూస్తున్నామని తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్‌లో గ్రామాలు దత్తత తీసుకొని ఆ గ్రామాల్లో విద్య, వైద్య, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు కృషి చేయాలన్నారు. పీహెచ్‌డీల కోసం యూనిఫాం పద్ధతిని తీసుకొచ్చి పీహెచ్‌డీ అడ్మిషన్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. పరిచయం చాలా ఫలప్రదంగా జరిగిందని, ఆరు నెలల తర్వాత మరో సారి భేటీ అవుతామని తెలిపారు. ఉన్నత విద్యపై అధికారి, మినిస్ట్రీ పరంగా రెగ్యులర్‌ పర్యవేక్షణ ఉంటుందన్నారు.

గవర్నర్ అభినందించారు : కడియం శ్రీహరి
హైదరాబాద్‌ : అగ్రికల్చర్ యూనివర్శిటీ, బాసర ఐఐఐటీలను గవర్నర్ అభినందించారని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. బుధవారం అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీలో గవర్నర్‌ నరసింహన్‌ అధ్యక్షతన జరిగిన వీసీల సమావేశంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ గత అక్టోబర్‌లో వీసీల సమావేశం నుంచి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని వీసీల వారీగా అడిగి గవర్నర్ తెలుసుకున్నారు. మూడు మాసాల్లో యూనివర్శిటీ పరిధిలోని అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ ప్రారంభించి స్టబడెంట్స్, స్టాఫ్ అటెండెన్స్ రెగ్యులేట్ చేయాలన్నారు. దేశంలో మహిళల పట్ల అక్కడక్కడ చోటుచేసుకుంటున్న అకృత్యాలు తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

అందుకోసం హాస్టల్స్ ఇతర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, గ్రీవియెన్స్ సెల్స్‌తో బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని వీసీలకు గవర్నర్ సూచించారు. యూజీసీ గైడ్ లైన్స్ ఎందుకు పీహెచ్‌డీ అడ్మిషన్లలో పాటించటం లేదని గవర్నర్ ప్రశ్నించారు. సెట్, నెట్,  స్లెట్ మెరిట్ ద్వారా పీహెచ్‌డీలో గైడ్స్ సామర్థ్యం, వారి క్యాపబిలిటీ ఆధారంగానే అడ్మిషన్లు ఇవ్వాలని సూచించారు. నిర్ణీత గడువులోగా పీహెచ్‌డీ పూర్తి చేయకపోతే అడ్మిషన్ రద్దు చేయాలి, రీసెర్చ్ కూడా ప్రామాణికంగా ఉండాలని ఆదేశించారు’’ అని అన్నారు. 

Advertisement
Advertisement