‘పెట్టుబడి’కి పెద్దలెందుకు?! | Sakshi
Sakshi News home page

‘పెట్టుబడి’కి పెద్దలెందుకు?!

Published Fri, Mar 2 2018 4:40 AM

Govt focus over Investment Amount to the poor farmers only - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎకరానికి రూ.4 వేలు చొప్పున రైతులకు ఇచ్చే పెట్టుబడి సొమ్మును పెద్దలు స్వచ్ఛందంగా వదులుకునేలా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తనకూ పెట్టుబడి సొమ్ము వస్తుందని, అయితే, స్వచ్ఛందంగా వదులుకుం టానని రైతు సమితి సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడం తెలిసిందే. దీంతో మం త్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారు లు, ఇతర పెద్దలు కూడా అదే బాటలో పయ నించేలా ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పేద, మధ్య తరగతి రైతులకు దక్కాల్సిన సొమ్మును పెద్దలు తీసుకుంటే విమర్శలు వస్తాయి. దీంతో పథకం నుంచి వారిని తప్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. మం త్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు స్వచ్ఛందంగా వదులుకునేలా చేస్తే మంచి పేరు వస్తుందని భావిస్తోంది. ఇలా చేయడం వల్ల ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు స్వచ్ఛందంగా వదులుకునే అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములున్న ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు కూడా ముందుకు వస్తారని భావిస్తున్నారు. మరోవైపు స్వచ్ఛందంగా పెట్టుబడిని వదులుకుంటామని లేఖలు అందజేసేలా సర్కారు ఆలోచిస్తోంది. వ్యవసాయ శాఖకు అలా లేఖలు పంపేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

వదులుకున్న వారికి ప్రచారం..
రాష్ట్రంలో 1.65 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమికి చెందిన రైతులకు ప్రభుత్వం వచ్చే ఖరీఫ్‌ నుంచి పెట్టుబడి సాయం అందించనుంది. అందుకోసం రైతులకు చెక్కు లను అందజేస్తుంది. ధనిక, పేద అనే సం బంధం లేకుండా అందరికీ పెట్టుబడి సాయం చేస్తానని ఇప్పటికే ప్రకటించింది. అయితే, 30–40 ఎకరాలకు మించి సాగు భూమి ఉన్న పెద్ద రైతులు, నేతలు, ఇతర ప్రముఖులను ఎలాగైనా పథకం నుంచి తప్పించే ఆలోచనలో సర్కారు ఉంది. వారిలో చైతన్యం కలిగించి స్వచ్ఛందంగా వదులుకునేలా ప్రచారం చేస్తారు.

గ్యాస్‌ సబ్సిడీని ధనవంతులు స్వచ్ఛందంగా వదులుకునేలా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. ఇప్పుడు అదేవిధంగా రాష్ట్రంలోనూ పెట్టుబడి రాయితీని వదులుకునేందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలని నిర్ణయించారు. ముందుగా మంత్రులు, ఎమ్మెల్యేలతో ‘నాకు పెట్టుబడి రాయితీ వద్దు’ అని ప్రకటన చేయించి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తారు. సినిమా నటులనూ ప్రోత్సహిస్తారు. వారితో ప్రచారం చేయించేందుకు సర్కారు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇలా వచ్చే నెల రోజులపాటు స్వచ్ఛందంగా పెట్టుబడి వదులుకునేలా కార్యక్రమం నిర్వ హిస్తారు. అందుకోసం అవసరమైతే ప్రముఖులతో ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతారు. స్వచ్ఛందంగా వదులుకున్న సొమ్మును రైతు కార్పొరేషన్‌లో జమ చేస్తారు. దాన్ని కార్పస్‌ ఫండ్‌గా ఏర్పాటు చేసి రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement