చిట్యాల: ఆధ్యాత్మిక బాబా డేరా సచ్ఛా సౌధా వ్యవస్థాపకుడు గుర్మిత్ రామ్రహీం సింగ్ ఆస్తులు నల్లగొండ జిల్లాలోనూ ఉన్నాయి. చిట్యాల మండలం వెలిమినేడు శివారులో జాతీయ రహదారి పక్కన ఉన్న 56 ఎకరాల్లో ఆయన డేరా సచ్ఛా సౌధాను 2007లో ఏర్పాటు చేశారు. వీటిల్లో అసైన్డ్ భూములు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
2005 నుంచి ఈ భూములను స్థానిక రైతుల నుంచి విడతల వారీగా కోనుగోలు చేసి ప్రహరీ నిర్మించారు. ఇక్కడ 4 గదుల భవనం ఉంది. ఈ డేరా బాగోగులను హైదరాబాద్లో నివాసం ఉండే శ్యాంలాల్ చూస్తున్నాడు. జమ్మికుంట, వావిళ్లకుంట అలుగు పోసినప్పుడు ఈ డేరాలోని భూముల నుంచే వర్రె కాల్వలు ద్వారా నీరు పోయేది. ప్రస్తుతం ఈ కాల్వలు లేకుండా పోయాయి.
తహసీల్దార్ పరిశీలన
చిట్యాల తహసీల్దార్ సీహెచ్ విశాలాక్షి వెలిమినేడులోని డేరా సచ్ఛా భూములను పరిశీలించారు. నిర్వాహకుడు శ్యాంలాల్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ భూముల్లోని 98, 102, 132 సర్వే నెంబరులలో 7 ఎకరాల 32 గుంటల అసైన్డ్ భూమి ఉన్నట్లు తేలిందని తహసీల్దార్ తెలిపారు. వీటిని త్వరలో స్వాధీనం చేసుకుంటామన్నారు. వర్రె కాల్వలను ఆమె పరిశీలించారు. బాబా గుర్మిత్ రామ్ రహీం సింగ్ నిర్మించి, నటించిన మెసెంజర్–1, మెసెంజర్–2 సినిమాల ను చిట్యాలలోని సుజన థియేటర్లో గత ఏడాది ఉచితంగా వారంపాటు ప్రదర్శించారు. ఈ సిని మాలను చూడాలంటూ పట్టణంలో బాబా అనుచ రులు విచిత్ర వేషధారణతో ప్రచారం చేశారు.