పార్టీలో చేర్చేందుకేనా...! | Sakshi
Sakshi News home page

జైపాల్‌రెడ్డిని కలిసిన మంత్రి హరీశ్‌

Published Tue, Nov 13 2018 8:12 PM

Harish Rao Met with Jaipal Reddy - Sakshi

సాక్షి, జహీరాబాద్‌: తాజా మాజీ మంత్రి టి.హరీశ్‌రావు కాంగ్రెస్‌ సీనియర్‌  నాయకుడు డీసీసీబీ మాజీ చైర్మన్‌ జైపాల్‌రెడ్డిని సోమవారం రాత్రి హైదరాబాద్‌లో కలిశారు. జైపాల్‌రెడ్డి సుడోకు పోటీల్లో పాల్గొని విదేశాల నుంచి తిరిగి వచ్చారు. ఈ మేరకు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లినట్లు చెబుతున్నా రాజకీయ కోణంలో వెళ్లి ఉంటారనే ప్రచారం సాగుతోంది. టీఆర్‌ఎస్‌లో చేరాల్సిం దిగా ఆహ్వానించి ఉంటారనే అభిప్రాయాన్ని జైపాల్‌రెడ్డి సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా జహీరాబాద్‌ తాజా మాజీ ఎమ్మెల్యే జె.గీతారెడ్డితో జైపాల్‌రెడ్డికి విభేదాలు ఉండడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

దసరా మరుసటి రోజున గీతారెడ్డి జైపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. జహీరాబాద్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌కి కంచుకోటగా ఉంటూ వస్తోంది. ఎలాగైనా టీఆర్‌ఎస్‌ పాగా వేయాలనే ఉద్ధేశంతో మంత్రి వూహ్యాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ నేతలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. మాజీ మంత్రి ఎం.డీ ఫరీదుద్దీన్‌ సైతం టీఆర్‌ఎస్‌లో చేరగా అధిష్టానవర్గం ఎమ్మెల్సీ పదవితో సత్కరించింది. జైపాల్‌రెడ్డిని సైతం టీఆర్‌ఎస్‌లోకి తేవాలనే ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఈ విషయమై జైపాల్‌రెడ్డి మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.

Advertisement
Advertisement