బాధితుల వివరాలు సేకరించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: అంతర్యుద్ధం కారణంగా ఇరాక్లో చిక్కుకున్న తెలంగాణ వారికి తగిన సాయం అందించేందుకు, అవసరమైతే వారిని తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు, ఇతరులు ఎవరైనా ఇరాక్లో చిక్కుకుపోయారేమో తెలుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది.
బాధితులకు సంబంధించి పాస్పోర్టు నంబర్, వారు ఇరాక్లో ఎక్కడ ఉండేదీ, పనిచేసే కంపెనీ తదితర వివరాలను వారి కుటుంబ సభ్యుల నుంచి సేకరించాలని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం భారత విదేశీ వ్యవహారాల శాఖతో, బాగ్దాద్లోని భారతీయ అధికారులతో సంప్రదిస్తోందని, ఇప్పటికే బాగ్దాద్లో హెల్ప్లైన్ ఏర్పాటు చేశారని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (ప్రొటోకాల్) ఎన్.వి.రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులకు సాయం అందించేందుకు తెలంగాణ సచివాలయంలోని ఎన్ఆర్ఐ సెల్లో హెల్ప్ైలైన్ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.