ఇక ఇన్‌స్పైర్ కావాలె... | Sakshi
Sakshi News home page

ఇక ఇన్‌స్పైర్ కావాలె...

Published Mon, Sep 22 2014 3:07 AM

ఇక ఇన్‌స్పైర్ కావాలె...

నేటి నుంచి రాష్ట్రస్థాయి ఎగ్జిబిట్ల ప్రదర్శన
 
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
ఎగ్జిబిట్లతో తరలివస్తున్న విద్యార్థులు, గైడ్ టీచర్లు
సందడిగా మారిన బిషప్ బెరెట్టా స్కూల్
బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో హెల్ప్‌లైన్ సెంటర్లు
ఆదివారం రాత్రి 7 గంటల వరకు 432 ఎగ్జిబిట్ల నమోదు
మొత్తం 763 ఎగ్జిబిట్ల ప్రదర్శన
పర్యవేక్షణకు ఎన్‌సీఈఆర్‌టీ ప్రొఫెసర్

 
 విద్యారణ్యపురి : తెలంగాణ రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కాజీపేటలోని బిషప్ బెరెట్టా హైస్కూల్‌లో బుధవారం వరకు జరగనున్న ఈ సైన్స్ ఎగ్జిబిట్ల ప్రదర్శనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇన్‌స్పైర్ నిర్వహణకు ఐదు కమిటీలను ఏర్పాటుచేయగా... ఆదివారం నుంచి ఎగ్జిబిట్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. రాత్రి ఏడు గంటల వరకు వివిధ జిల్లాల నుంచి 432 ఎగ్జిబిట్లతో విద్యార్థులు, వారి గైడ్ టీచర్లు వచ్చి నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి హాజరుకానున్న విద్యార్థులు, గైడ్‌టీచర్ల కోసం జిల్లా కేంద్రంలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వచ్చిన వారిని వచ్చినట్లు బిషప్ బెరట్టా హైస్కూల్‌కు వాహనాల్లో తీసుకువస్తున్నారు.

763 ఎగ్జిబిట్లు.. 1800 మంది విద్యార్థులు, టీచర్లు

రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌కు పది జిల్లాలకు చెందిన విద్యార్థులు 763 సైన్స్ ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నారు. విద్యార్థులు, వారి గైడ్ టీచర్లు కలిపి 1800 మంది అవకాఆలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు 432 ఎగ్జిబిట్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది. హాజరైన విద్యార్థులు వారి ఎగ్జిబిట్ల ప్రదర్శనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరు నుంచి ఎనిమిది వరకు సబ్‌థీమ్స్‌లో ఎగ్జిబిట్లు ప్రదర్శించనుండగా.. ఇందులో పవర్ జనరేషన్, న్యూట్రిషన్ ఫుడ్, హెల్త్, పొల్యూషన్, వ్యవసాయరంగం, సోలార్ ఎనర్జీ ఇలా సైన్స్, సోషల్‌కు చెందిన వివిధ ఎగ్జిబిట్లు ఉంటాయి. ఇన్‌స్పైర్ నిర్వహణకు ప్రధాన వేదిక కాజీపేలోని బిషప్ బెరట్టా కాగా, పక్కనే ఉన్న బీఈడీ కళాశాలలో కలిపి మొత్తం 37 గదుల్లో ఎగ్జిబిట్ల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఇన్‌స్పైర్‌కు వరంగల్ జిల్లా నుంచి 129 ఎగ్జిబిట్లు, ఖమ్మం నుంచి 40, కరీంనగర్ నుంచి 118, ఆదిలాబాద్ నుంచి 30, నిజామాబాద్ నుంచి 32, మహబూబ్‌నగర్ నుంచి 76, మెదక్ నుంచి 75, నల్లగొండ నుంచి 30, రంగారెడ్డి నుంచి 135, హైదరాబాద్ నుంచి 98 చొప్పున ఎగ్జిబిట్లు ప్రదర్శించనున్నారు.

పర్యవేక్షణకు ప్రొఫెసర్లు

కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న ఇన్‌స్పైర్ ఇన్‌స్పైర్ ఏర్పాట్లు, నిర్వహణ పరిశీలన కోసం రాష్ట్ర విద్యాపరిశోధన మండలి (ఎస్‌సీఈఆర్‌టీ)నుంచి ప్రొఫెసర్ వేణయ్య జిల్లాకు చేరుకున్నారు. ఆయనతో పాటు సైన్స్ సూపర్‌వైజర్ ఉమాదేవి, డీఈఓ డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్, డిప్యూటీ డీఈఓలు రవీందర్‌రెడ్డి, అబ్దుల్‌హై, కృష్ణమూర్తి, ఎంఈఓలు వీరభద్రనాయక్, ప్రేమేందర్‌రెడ్డి బిషప్‌బెరట్టా హైస్కూల్‌కు ఆదివారం సాయంత్రం చేరుకుని వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. ఆహ్వాన కమిటీ, రిజిస్ట్రేషన్ కమిటీతో పాటు ఇన్‌స్పైర్ నిర్వహణకు 250మంది హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులతో కలిపి 22 కమిటీలను ఏర్పాటుచేసిన అధికారులు, 300 మంది ఎన్‌సీసీ వలంటీర్లకు కూడా అందుబాటులో ఉంచారు. ఏదైనా అవసరమున్న వారు వీరిని సులువుగా గుర్తించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన టోపీలు, టీషర్ట్‌లు అందజేశారు.

వివిధ ప్రాంతాల్లో వసతి

వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల విద్యార్థులు, గైడ్‌టీచర్లకు నగరంలోని అవంతి, న్యూత్రివి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల విద్యార్థులకు గ్రీన్‌వుడ్, విజ్ఞాన్ స్కూళ్లలో బసకు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల విద్యార్థులకు సెయింట్ పీటర్స్, గ్యాబ్రియల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల వారికి శ్రీనిధి, లయోలా, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల వారికి స్టేషన్ ఘన్‌పూర్‌లోని సెయింట్ థామస్, హోళీక్లాస్ హైస్కూళ్లలో వసతి ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిరోజు సాయంత్రం బిషప్ బెరట్టా హైస్కూల్ నుంచి వాహనాల్లో విద్యార్థులు, టీచర్లుకు వారి బసకు పంపించి ఉదయమే తీసుకొస్తారు. అలాగే, సాయంత్రం పూట వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, , కాజీపేట రైల్వేస్టేషన్‌లో లయన్స్‌క్లబ్ హన్మకొండ శాఖ ఆధ్వర్యంలో హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటుచేసినట్లు నిర్వాహకుడు శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

జాతీయ స్థాయికి 40 నుంచి 45 ఎగ్జిబిట్లు

వరంగల్‌లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్ నుంచి జాతీయ స్థాయికి 40 నుంచి 45 ఎగ్జిబిట్లను ఎంపిక చేయనున్నారు. ఇక్కడి ఇన్‌స్పైర్‌లో ప్రదర్శించే ఎగ్జిబిట్లను 16మంది జడ్జిలతో మొదటి ప్యానల్ పరిశీలిస్తుంది. మొత్తం 763 ఎగ్జిబిట్లలోని ఎనిమిది శాతం ఎగ్జిబిట్లను వీరు ఎంపిక చేయనుండగా, ఆ తర్వాత ముగ్గురు నిట్ ప్రొఫెసర్లు పరిశీలించి అందులోని నుంచి ఐదు శాతం ఎగ్జిబిట్లను అక్టోబర్ 6నుంచి ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌కు ఖరారు చేస్తారు.
 
 ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు

 
- డాక్టర్ ఎస్.విజయకుమార్, డీఈఓ
 తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారి రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ నిర్వహించే అవకాశం వరంగల్‌కు దక్కింది. దీంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కాజీపేటలోని బిషప్ బెరట్టా హైస్కూల్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎగ్జిబిట్లతో వచ్చే విద్యార్థులు, టీచర్లుకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు 22 కమిటీలను ఏర్పాటుచేశాం. కాగా, వరంగల్, కాజీపేట, హన్మకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు 22, 23వ తేదీలోల సెలవులు లేవని, వారితో పాటు ప్రైవేటు,ఎయిడెడ్ ఉన్నతపాఠశాలల ఉపాధ్యాయులు తమ విద్యార్థులను ఇన్‌స్పైర్‌కు తీసుకురావాలి.

జిల్లాలోని మిగతా చోట్ల నుంచి కూడా ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా తీసుకొస్తే విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించినట్లవుతుంది. సోమవారం ఉదయం జరిగే ఇన్‌స్పైర్ ప్రారంభోత్సవ సభకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అధ్యక్షత వహించనుండగా,  డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎంపీలు సీతారాంనాయక్, కడియం శ్రీహరి, కలెక్టర్ జి.కిషన్, ఎమ్మెల్యే చందూలాల్ తదితరులు పాల్గొంటారు.
 
 

Advertisement
Advertisement