న్యాయం జరగకుంటే విషం తాగి చస్తాం | Sakshi
Sakshi News home page

న్యాయం జరగకుంటే విషం తాగి చస్తాం

Published Thu, Mar 12 2015 12:12 AM

Justice from being drunk poison

తూప్రాన్ : ‘నా పరువు ఎలా పోయిందో.. ఎంపీపీ పరువు కూడా అలాగే పోవాలి.. లేకుంటే విషం తీసుకుని కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటాం’ అని బాధితురాలు అంగన్‌వాడీ కార్యకర్త మనీల డిమాండ్ చేసింది. పంచాయతీ పరిధిలోని ఆబోతుపల్లిలో బాధితురాలు మనీల కుటుంబాన్ని బుధవారం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతనిధి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత మహిళ మనీల తన పట్ల ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్ అసభ్యంగా మాట్లాడడమే కాకుండా ఫోన్‌లోని సంభాషణలను వాట్స్‌ప్, ఇంటర్‌నెట్‌లో పెట్టి తన పరువు తీస్తున్నాడని కంటతడి పెట్టింది.

చిన్నపిల్లల నుంచి పెద్దలు తనను చూసి హేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై తన భర్త నిలదీస్తే చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొంది. రేషన్‌కార్డు, తన అత్త పింఛన్ తొలగిస్తానాని బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. దీంతో మనోవేదనకు గురై ఎస్పీ సుమతిని కలిసి తన గోడును వెలబుచ్చానని తెలిపింది. అయితే పోలీసులు నామ మాత్రం కేసులు నమోదు చేశారని ఆరోపించింది. అనంతరం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో దళిత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. రెండు నెలలుగా ఈ వ్యవహారంలో స్పందించని పోలీసులు అధికారుల పట్ల మండిపడ్డారు.

టీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఎంపీపీ వ్యవహారంతో తమ పార్టీ పరువు పోతుందని కేసును నీరుగార్చే ప్రయత్నిలు చేస్తున్నారని ఆరోపించారు. దళిత మహిళ, అంగన్‌వాడీ కార్యకర్త పట్ల అసభ్యంగా ప్రవర్తించి అవమానాలకు గురిచేసిన ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్‌ను పదవి నుంచి తొలగించి  వెంటనే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామ పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రానున్న నేపథ్యంలో మహిళలతో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే తమ పార్టీలోని దళిత వర్గానికి చెందిన మోత్కుపల్లి నరసింహులు, మహిళల ఉద్యమ నాయకురాలు విమలక్క, దళిత సంఘాలతో కలిసి ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ప్రతాప్‌రెడ్డి వెంట నాయకులు విరాసత్ అలీ, పార్టీ మండల అధ్యక్షుడు కిష్టారెడ్డి, ఎంపీటీసీ ఎక్కల్‌దేవ్ వెంకటేష్ యాదవ్, పట్టణశాఖ అధ్యక్షుడు ఉపేందర్, ఆర్ అంజగౌడ్, మల్లేష్, సిద్దిరాంలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement