14న విశాఖకు సీఎం కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

14న విశాఖకు సీఎం కేసీఆర్‌

Published Wed, Jan 30 2019 3:11 AM

KCR for Anniversary of Visakhapatnam Sharda Peetham - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కె.చంద్రశేఖర్‌రావు మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్నారు. ఫిబ్రవరి 14న విశాఖపట్నంలోని శారద పీఠానికి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల చివరి రోజు నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమంలో కేసీఆర్‌ పాల్గొంటారు. పూర్ణాహుతి కార్యక్రమానికి రావాల్సిందిగా విశాఖ శారదా పీఠం నుంచి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానానికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఉత్సవాలకు హాజరు కావాలని నిర్ణయించారు. శారద పీఠం కార్యక్రమానికి హాజరయ్యేలా సీఎం కేసీఆర్‌ పర్యటన ఖరారైనట్లు తెలిసింది.  

ఫెర్నాండెజ్‌ మృతిపై సంతాపం... 
కేంద్ర మాజీ రక్షణ మంత్రి జార్జీ ఫెర్నాండెజ్‌ మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కార్మిక నాయకుడిగా, కేంద్ర మంత్రిగా ఫెర్నాండెజ్‌ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఫెర్నాండెజ్‌ మృతిపై ఆయన సన్నిహితులకు సానుభూతి వ్యక్తం చేశారు. 

నేడు గాంధీజీకి నివాళులు
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌ లంగర్‌హౌజ్‌లోని బాపు ఘాట్‌ వద్ద తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్, సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు బాపు ఘాట్‌ వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తారు.  

అసెంబ్లీ ప్రొరోగ్‌... 
శాసన మండలి, శాసన సభలను ప్రొరోగ్‌ చేస్తూ గవర్నర్‌ నరసింహన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం జనవరి 17 నుంచి 20 వరకు శాసనసభ సమావేశాలు జరిగాయి. గవర్నర్‌ ప్రసంగం, దీనికి ధన్యవాదాలు తెలిపే అంశంపై జనవరి 19, 20 తేదీల్లో శానసమండలి సమావేశాలు జరిగాయి. త్వరలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుత సమావేశాలను ప్రొరోగ్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Advertisement
Advertisement