Sakshi News home page

నేడు గుట్టకు కేసీఆర్

Published Thu, Mar 5 2015 2:54 AM

KCR to go Yadagiri gutta along with chinnajeer swamy

 సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట క్షేత్రం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గురువారం ఉదయం మరోసారి గుట్టకు వెళ్లనున్నారు. పదిరోజుల వ్యవధిలో యాదగిరి క్షేత్రాన్ని సందర్శించటం ఇది మూడోసారి కావటం విశేషం. యాదగిరీశుని ఆలయాన్ని గత నెల 25, 27న సీఎం సందర్శించారు. దేవాలయ అభివృద్ధిలో భాగంగా చేపట్టబోయే పనులకు సంబంధించి ప్రతిపాదిత నమూనాలు, ప్రాంతాలను పరి శీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టువస్త్రాలు కూడా సమర్పించారు.
 
 తుది నమూనాలు, ప్రణాళికలు సిద్ధం చేసేముందు శాస్త్రబద్ధంగా మరోసారి సరిచూసుకోవాలని ఆయన భావిస్తున్న నేపథ్యంలో క్షేత్రానికి గురువారం చినజీయర్ స్వామిని వెంట తీసుకెళ్లాలని నిర్ణయించారు. అక్కడ చేపట్టే పనులను సీఎం వివరించనున్నారు. చినజీయర్‌స్వామి సూచనలు విన్న తర్వాతే ప్రణాళికలు ఖరారు చేయబోతున్నారు. సీఎం కేసీఆర్, చిన జీయర్‌స్వామీజీ హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. ఉదయం 11గంటలకు వారు గుట్టకు చేరుకుం టారని అధికారులు తెలిపారు. వీరికన్నా ముందే అధికారు లు రోడ్డుమార్గాన ఆలయానికి చేరుకుంటారు.

Advertisement
Advertisement