ఇంకా వెంటిలేటర్‌పైనే మాధవి | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 20 2018 11:49 AM

Madhavi Health Bulletin Released By Yashoda Doctors - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమ వివాహం చేసుకుని తండ్రి చేతిలో బుధవారం దాడికి గురై.. ప్రాణలతో పోరాడుతున్న మాధవి హెల్త్‌ బులిటెన్‌ను యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. మాధవికి ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతుందని తెలిపారు. ఇంకా ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వెల్లడించారు. కత్తితో నరకడం వల్ల ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉందన్నారు. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నలుగురు వైద్యుల బృందం ఆమెకి చికిత్స అందించిందన్నారు.

ఇంకా వారు మాట్లాడుతూ.. ‘మాధవి ఆస్పత్రికి వచ్చే సరికి చాలా రక్తస్రావం జరగడంతో హిమోగ్లోబిన్‌ చాలా తక్కువగా ఉంది. 8 గంటలపాటు శ్రమించి రక్తస్రావాన్ని తగ్గించాం. ఆమెకు ఆరు బాటిళ్ల రక్తాన్ని ఎక్కించాం. మెడపై ఆమెకు తీవ్ర గాయమైంది. ముఖకవళికలకు సంబంధించిన నరాలు, మెదడుకు వెళ్లే ప్రధాన నరం, ఎడమ చేయి ఎముక పూర్తిగా దెబ్బతిన్నాయి. మూడు సర్జరీలు చేసి వాటిని సెట్‌ చేసాం. మెడపై ఉన్న గాయాలను తగ్గించే ప్రయత్నం చేశాం. తొలుత ఆమె ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నించాం. ఆమె ఇతర ఆవయవాలపై ప్రభావం చూపకుండా ఈ శస్త్రచికిత్సలు నిర్వహించాం. ఇది చాలా సంతృప్తికరంగా సాగింది. అయినప్పటికీ మరో 48 గంటలు గడిస్తే గానీ మాధవి కండీషన్‌ చెప్పలే’మని తెలిపారు.

Advertisement
Advertisement