సిద్దిపేటకు మెడికల్‌ కాలేజీ | Sakshi
Sakshi News home page

సిద్దిపేటకు మెడికల్‌ కాలేజీ

Published Wed, Dec 14 2016 5:14 AM

Medical College to the SIDDIPET

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదం

సాక్షి, హైదరాబాద్‌: సిద్దిపేటలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదముద్ర వేశారు. అక్కడ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తానని ఇటీవల సీఎం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ వెళ్లి అక్కడ అధ్యయనం చేసి వచ్చింది. మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు అక్కడ అనువైన పరిస్థితులు ఉన్నాయని కమిటీ తేల్చి చెప్పడంతో సీఎం అందుకు అధికారికంగా ఆమోదం తెలిపారు. అనంతరం ఎసెన్షియల్‌ సర్టిఫికెట్‌ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్‌ను మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ)కి పంపిస్తారు.

ఆ తర్వాత ఎంసీఐ ప్రతినిధి బృందం సిద్దిపేటకు వెళ్లి పరిశీలించాక అక్కడ మెడికల్‌ కాలేజీకి కేంద్రం అనుమతి ఇవ్వనుంది. ఈ తతంగానికి సాంకేతికంగా కొంత సమయం పడుతుంది. కాబట్టి వచ్చే ఏడాది కాకుండా 2018–19 సంవత్సరానికి సిద్దిపేట మెడికల్‌ కాలేజీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం 150 ఎంబీబీఎస్‌ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరనుంది. నర్సింగ్‌ సీట్లకు కూడా అనుమతి కోరాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డాక మహబూబ్‌నగర్‌లో ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ సిద్దిపేటకు మంజూరు కానుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement