ఆరు యూనిట్లుగా గాంధీ ఆసుపత్రి: ఈటల | Sakshi
Sakshi News home page

పూర్తి సమాచారం సిద్ధంగా ఉండాలి..

Published Thu, Apr 23 2020 5:24 PM

Minister Etela Rajender Review Meeting On Corona Prevention Measures - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆసుపత్రిని పూర్తిస్థాయి కోవిడ్‌ ఆసుపత్రిగా ప్రకటించామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. గురువారం ఆయన గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్‌ వ్యక్తుల అడ్మిషన్లు, వైద్యం, పరీక్షలు, డిశ్ఛార్జ్‌లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ బాధితులందరికి ఇక్కడే వైద్య చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రిని మొత్తం ఆరు యూనిట్లుగా విభజించాలని.. ప్రతి యూనిట్‌కు ఒక ప్రొఫెసర్‌ను ఇంఛార్జ్‌గా నియమించాలని మంత్రి సూచించారు.
(21,393కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు) 

మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి..
అన్నీ యూనిట్లలో సమానంగా రోగులు ఉండేలా చూడాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజారావును ఆదేశించారు. బాధితుడు అడ్మిట్‌ అయినప్పటి నుంచి డిశ్చార్జ్‌ అయ్యే వరకు ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం సిద్ధంగా ఉంచాలని మంత్రి కోరారు. బాధితులకు ఉదయం, సాయంత్రం పరీక్షలు నిర్వహించాలని.. డయాబెటిస్‌, బీపీ, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారి పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు.
(తాళం పగలగొట్టి.. క్వారంటైన్‌ నుంచి పరారీ)

వారు విధిగా పీపీఈ కిట్లు ధరించాలి..
చిన్న పిల్లల తల్లిదండ్రులు ఆసుపత్రిలో ఉంటే వారి దగ్గరే ఉంచాలని మంత్రి సూచించారు. పీడియాట్రీషియన్ల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందించాలని కోరారు. గాంధీ ఆసుపత్రిలో కేవలం కరోనా పాజిటివ్‌ బాధితులు మాత్రమే ఉన్నారు కాబట్టి.. వైరస్‌ వ్యాప్తి జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్‌, శానిటేషన్‌ సిబ్బంది విధిగా పీపీఈ కిట్లు ధరించాలని మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు.

Advertisement
Advertisement