మంత్రిగారు.. చూశారా తీరు! | Sakshi
Sakshi News home page

మంత్రిగారు.. చూశారా తీరు!

Published Tue, Jul 15 2014 2:56 AM

Minister is .. Exactly the way!

పంచాయతీ కార్యదర్శుల   నియామకాల్లో జాప్యం
నెలలు   గడుస్తున్నా పోస్టింగ్ ఆర్డర్లులివ్వని వైనం
{పజావాణిలో డీఆర్వోకు విన్నవించిన అభ్యర్థులు
పంచాయతీరాజ్ శాఖ మంత్రి స్పందించాలని వినతి

 
ఉద్యోగం కోసం వారెంతో శ్రమించారు. ప్రభుత్వం పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గి పంచాయతీ కార్యదర్శి కొలువు కొట్టారు. కానీ వారికి ఆ ఆనందమే మిగలకుండాపోయింది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకుండా అధికారులు నెలల తరబడి తాత్సారం చేస్తున్నారు. కొందరి విద్యార్హతలపై అనుమానం ఉంద ని, విచారణ తర్వాతే అందరికీ పోస్టింగ్ అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ, నిజామాబాద్, మెదక్, వరంగల్ జిల్లాల్లో అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సొంత జిల్లాలో మాత్రం పోస్టింగుల్లో జాప్యం కావడం గమనార్హం.
 
జిల్లాలో ఖాళీగా ఉన్న 88 పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసేందుకు గతేడాది చివరలో అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న రాత పరీక్ష నిర్వహించింది. మార్చిలో  ఫలితాలు వెలువడ్డారుు. రెండువారాల లోపు ఎంపికైన అభ్యర్థుల విద్యార్హత ధ్రువీకరణపత్రాలు పరిశీలించి వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలి. జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఉపాధికల్పనాధికారులతో కూడిన ఎంపిక కమిటీ జూన్, జూలైలో మూడుసార్లు అభ్యర్థుల విద్యార్హత సర్టిఫికెట్లను పరిశీలించింది. ఈ నెల 3న తుది పరిశీలన జరిగింది. ఇందులో 14 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లపై అనుమానం వ్యక్తం చేసిన అధికారులు ప్రక్రియను అక్కడే నిలిపేశారు. అనుమానిత అభ్యర్థుల సర్టిఫికెట్లు తీసుకుని.. వారు ఏ సమయంలో ఎక్కడ చదివారని విచారణ చేయాలని నిర్ణయించారు. కానీ.. ఇంతవరకు విచారణ మొదలే కాలేదు. దీంతో సర్టిఫికెట్లు సరిగా ఉన్న 74 మంది అభ్యర్థులు తమకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలంటూ జిల్లా పంచాయతీ అధికారులపై ఒత్తిడి తెచ్చారు.

14 మంది అనుమానిత అభ్యర్థుల సర్టిఫికెట్లు సరిగా ఉన్నాయని తేలిన తర్వాతే అందరికీ ఒకేసారి ఉత్తర్వులు ఇస్తామని, అప్పటివరకు వేచి ఉండాలని అధికారులు లింకుపెట్టారు. ఆ తర్వాత కూడా నియామక ప్రక్రియ నిలిచిపోవడంతో అభ్యర్థులు పలుమార్లు డీపీవోను కలిసి పోస్టింగ్ ఆర్డర్ల కోసం మొరపెట్టుకున్నారు. అయినా స్పందన  లేకపోవడంతో సోమవారం ప్రజావాణిలో డీఆర్వో వీరబ్రహ్మయ్యకు విన్నవించారు. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి కుమారస్వామి వివరణ ఇస్తూ.. 14మంది అభ్యర్థుల విద్యార్హతలపై అనుమానం ఉందని, క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన తర్వాత అందరికీ ఒకేసారి పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తామని చెప్పారు. అభ్యర్థులు చింతించాల్సిన అవసరం లేదన్నారు.
 

Advertisement
Advertisement