ఎమ్మెల్యేపై ఆరోపణలు అవాస్తవం | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేపై ఆరోపణలు అవాస్తవం

Published Sat, Aug 1 2015 3:20 AM

MLA on the charges of fallacy

ఎవరి భూములూ కబ్జా చేయలేదు
అప్రతిష్టపాలు చేసేందుకే ఆరోపణలు
ధైర్యముంటే ఎర్రాపహడ్‌కు వచ్చి నిరూపించండి
అఖిలపక్షానికి టీఆర్‌ఎస్ సవాల్
 
 కామారెడ్డి : నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏనుగు రవీందర్‌రెడ్డిని ఎదుర్కొనలేక, ఓటమి చెందినవారు ఆయన ప్రతిష్టను దెబ్బతీయడానికే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఎర్రాపహడ్‌కు వచ్చి ఎవరి భూములు ఆక్రమణకు గురయ్యాయో నిరూపించాలని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, టీఆర్‌ఎస్ నేతలు సవాల్ విసిరారు. శుక్రవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదాశివనగర్, గాంధారి జడ్పీటీసీ సభ్యులు రాజేశ్వర్‌రావ్, తానాజీరావ్, ఎల్లారెడ్డి ఎంపీపీ నక్క గంగాధర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నవారు ఎర్రాపహడ్‌లో ఆక్రమణలను రుజువు చేస్తే తామంతా పదవులకు రాజీనామా చేస్తామని, గజం ఆక్రమించినట్టు తేలితే గజానికి ఎకరం భూమి ఇప్పిస్తామని స్పష్టం చేశారు.

భూములను కొలవడానికి అధికారులు వ చ్చినపుడు అఖిలపక్ష నేతలంతా వచ్చి ప్రత్యక్షంగా చూసి ఎక్కడ ఆక్రమణకు గురయ్యూయో చూపించాలన్నారు. ఎన్నికలప్పుడే కనిపించే నాయకులు ఎమ్మెల్యేను ఎదుర్కొనలేక భూ ఆక్రమణలంటూ దళితులను మో సం చేస్తున్నారని ఆరోపించారు. అఖిల పక్ష నేతలు ఎల్లారెడ్డిలోనో, తాడ్వాయిలోనో, కామారెడ్డిలోనో మాట్లాడకుండా ఎర్రాపహడ్‌లో గ్రామ సభకు సిద్దం కావాలని అన్నారు. తేదీ ప్రకటిస్తే ప్రజల సమక్షంలో మాట్లాడి, ప్రజల సమక్షంలో కొలతలు వేయించేందుకు సిద్ధమని ప్రకటించారు. రవీందర్‌రెడ్డి దళితుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, భూపంపిణీ కార్యక్రమంలో జిల్లాలో అన్ని మండలాల కంటే ఎక్కువగా తాడ్వాయి మండల దళితులకే ఇప్పించారని పేర్కొన్నారు.

ప్రతిపక్షాలు అమాయక ప్రజలను మోసం చేయడం మంచిది కాదన్నారు. ఎల్లారెడ్డిలో అఖిలపక్ష సమావేశానికి అనుమతి తీసుకోలేదని పోలీసులు అరెస్టు చేస్తే, ఎమ్మెల్యేనే చేయించాడంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే ఎమ్మెల్యే భూములను సర్వే చేసిన అధికారులు అక్కడ దళితుల భూములు లేవని ప్రకటించారని గుర్తుచేశారు. సమావేశంలో డీసీసీబీ డెరైక్టర్ సంపత్‌గౌడ్,  ఎంపీపీలు బసంత, విజయ, జడ్పీటీసీలు కాశినారాయణ, సామెల్, సావిత్రి, టీఆర్‌ఎస్ నాయకులు నారెడ్డి లింగారెడ్డి, గడ్డం రాంరెడ్డి, మహేందర్‌రెడ్డి, ముదాం సాయిలు, శివాజీరావ్, భూంరెడ్డి, సాయిరెడ్డి, సంతోష్‌రెడ్డి, భూమాగౌడ్  పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement