లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ మృతి  | Sakshi
Sakshi News home page

లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతి

Published Sat, Nov 16 2019 10:24 PM

MMTS Loco Pilot Chandrashekar Died - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాచిగూడ రైల్వే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకోపైలట్‌ ఎల్‌.చంద్రశేఖర్‌ (35) శనివారం రాత్రి మృతి చెందాడు. ఎంఎంటీఎస్, ఇంటర్‌సిటీ రైలు సోమవారం ఢీకొన్న ఘటనలో ఎంఎంటీఎస్‌ రైలు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ను అతికష్టంమీద బయటకు తీసి నాంపల్లి కేర్‌ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితికి చేరడంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్సలు అందించారు. రెండ్రోజుల క్రితమే ఆయన కుడికాలును కూడా తొలగించారు. కిడ్నీలు కూడా పనిచేయడం మానేశాయి. శనివారం రాత్రి కార్డియాక్‌ అరెస్ట్‌తో చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫిరంగుల దిబ్బకు చెందిన లోకోపైలట్‌ ఎల్‌.చంద్రశేఖర్‌ డెక్కపాటి 2011లో ఉద్యోగంలో చేరాడు. కాచిగూడ నెహ్రూనగర్‌లో ఉంటున్నాడు. హైదరాబాద్‌ రైల్వే డివిజన్‌ మెకానిక్‌ విభాగంలో చేరి లోకోపైలట్‌గా పని చేస్తున్నాడు.ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 15రోజుల క్రితమే మగబిడ్డ పుట్టాడు. చంద్రశేఖర్‌ మృతితో ఆ కుటుంబం లో విషాద ఛాయలు అలముకున్నాయి.  

Advertisement
Advertisement