మరో రాష్ట్రం కోసం ఉద్యమం తప్పదు | Sakshi
Sakshi News home page

మరో రాష్ట్రం కోసం ఉద్యమం తప్పదు

Published Sun, May 14 2017 3:49 AM

మరో రాష్ట్రం కోసం ఉద్యమం తప్పదు - Sakshi

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వివక్షను ప్రదర్శిస్తున్నారని, ఇలానే కొనసాగితే ప్రత్యేక రాష్ట్రం కోసం మరో ఉద్యమం తప్పదని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలతో కలసి ఆయన గాంధీభవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. డిండి, పాలమూరు ప్రాజెక్టులను అనుసంధానం చేస్తే రైతులకు నష్టం జరుగుతుందని, మహబూబ్‌నగర్, నల్లగొండ ,రంగారెడ్డి పాతజిల్లాల ప్రజలు కొట్టుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

ప్రజలను విడదీసి రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే సీఎం కేసీఆర్‌ రాజకీయ కుట్ర వల్ల భవిష్యత్తులో జలయుద్ధం వచ్చే ప్రమాదముందన్నారు. టీఆర్‌ఎస్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, ఖరీఫ్‌కు కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కింద నీరు అందించకపోతే ఉద్యమం చేసి సాధించుకుంటామన్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరు ఉన్నా కల్వకుర్తికి నీళ్లు లేవని విమర్శించారు. పాలమూరు జిల్లాకు పూర్తి స్థాయిలో నీరిచ్చినపుడే బంగారు తెలంగాణ సాధ్యమని, సాగునీటి కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు.

Advertisement
Advertisement