మాట మరిస్తే టీడీపీ మునుగుతుంది | Sakshi
Sakshi News home page

మాట మరిస్తే టీడీపీ మునుగుతుంది

Published Fri, Jan 2 2015 3:45 AM

MRPS warns TDP to stand on SC Classification of the Scheduled Castes

సాక్షి, హైదరాబాద్: మాదిగ జాతిని నట్టేట ముంచాలని చూస్తే మునిగిపోయేది టీడీపీనేనని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. ఎస్సీల వర్గీకరణపై ఏపీ సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకోకుంటే తెలంగాణలో పార్టీని రద్దు చేసుకోవాల్సి వస్తుందని, ఏపీలో ప్రభుత్వం గద్దె దిగాల్సి వస్తుందని చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటిస్తున్నామన్నారు. ఫిబ్రవరి 14న విజయవాడలో ‘మహా విశ్వరూపం’ మహాసభను నిర్వహించనున్నట్లు చెప్పారు.  
 
 జాతీయ అధ్యక్షుడిగా మాణిక్యరావ్ మాదిగ
 ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యరావు మాదిగ (ప్రకాశం) ఎన్నికైనట్లు మంద కృష్ణ తెలిపారు. కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా రాగాటి. సత్యం మాదిగ (హైదరాబాద్), అధికార ప్రతినిధిగా జి.ఈశ్వరయ్య (కర్నూలు), ఎంఇఎఫ్ కమిటి జాతీయ అధ్యక్షులుగా ప్రసాద్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా బోయ జగన్నాథ్‌లు జాతీయ సమావేశంలో ఎన్నికైనట్లు తెలిపారు.
 
 ఏపీ కమిటీ..: ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ(ప్రకాశం), కార్యనిర్వాహక అధ్యక్షులుగా మల్లవరపు నాగయ్య మాదిగ (గుంటూరు), అధికార ప్రతినిధిగా సొట్ట. నరేంద్రబాబు మాదిగ ( చిత్తూరు), ఎంఇఎఫ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులుగా సిహెచ్. శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా బండారు శంకర్‌లు ఎన్నికయ్యారని  మంద కృష్ణ మాదిగ ప్రకటించారు.

Advertisement
Advertisement