అత్యవసర పనులు చేయాల్సిందే | Sakshi
Sakshi News home page

అత్యవసర పనులు చేయాల్సిందే

Published Wed, Sep 24 2014 1:32 AM

must be do  emergency tasks

ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో రెవెన్యూ శాఖ పనులతోపాటు ఇతర అత్యవసర పనులూ చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పన్ను వసూలు, బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ల ఏర్పాటు, ప్రభుత్వ, దేవాలయ భూములు, రైతు రుణాల రీషెడ్యూల్, రైతు ఆత్మహత్యలకు సంబంధించిన నివేదికలు, నాలా పన్ను, పారిశ్రామిక పార్కులకు భూముల గుర్తింపు, రెవెన్యూ కార్యాలయ భవనాల మరమ్మతు, నిర్మాణాలు, కోర్టు కేసు లు వంటి అంశాలపై చర్చించారు.

 అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూకు సంబంధించి వివిధ పనులకు వీఆర్వో, పంచాయతీ కార్యదర్శుల సహకారం తీసుకోవాలన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వ భూములు గుర్తించాలని చెప్పారు. దేవాలయ భూములు దేవాదాయశాఖ ఆధీనంలోనే ఉండాలన్నారు. ఇందుకు దేవాలయం పేరిట నిబంధనల ప్రకారం పట్టాలు ఇవ్వాలని చెప్పారు. జిల్లాలోని 39 మండలాల్లో మార్చిలో రైతులు తీసుకున్న పంట రుణాల రీషెడ్యూల్‌కు రిజర్వు బ్యాంకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. 2014 మార్చి 31 నాటికి బ్యాంకుల్లో అప్పు ఉన్న రైతులకు ఇది వర్తిస్తుందన్నారు. జిల్లాలో జమాబందీని వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

 పారిశ్రామిక సంస్థలకు పది వేల ఎకరాలు
 జిల్లాలో పారిశ్రామిక సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వ భూములు 10 వేల ఎకరాల గుర్తించాలని, ఇందుకు రెవె న్యూ అధికారులు సర్వే చేసి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కోర్టు కేసులపై పూర్తి నివేదికలు సమర్పించాలని, కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలన్నారు. సమావేశంలో అదనపు జేసీ రాజు, సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్, డీఆర్వో ప్రసాదరావు, ఆర్డీవోలు అరుణశ్రీ, సుధాకర్‌రెడ్డి, రామచంద్రయ్య, అయేషామస్రత్ ఖానమ్, ఎల్‌డీఎం.శర్మ, తహశీల్దార్లు పాల్గొన్నారు.

 ‘బతుకమ్మ’ విజయవంతం చేయండి
 ఆదిలాబాద్ టౌన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగను విజయవంతం చేయాలని కలెక్టర్ జగన్మోహన్ కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బంగారు బతుకమ్మ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగకు అన్ని వసతులు కల్పించడానికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.

ఆనంతరం జాగృతి రాష్ట్ర కార్యదర్శి ఎన్.రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టంలో మొదటిసారిగా బతుకమ్మ పండుగను ప్రభుత్వ పరంగా నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. బతుకమ్మ పండగకు సహజ సిద్ధమైన పూలనే వాడాలని అన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సాహెబ్‌రావు, విలాస్‌గౌడ్, సుజాత, మీరా, జ్యోతి, కాంచన, అంజనదేవి, అరుణ, అనంద్‌రావు, శ్రీనివాస్, అనిల్, దేవన్న, రాంరెడ్డి, ఖలీల్, ఆనంద్‌రావు, మంజుషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement