‘ముత్తూట్‌ ఫైనాన్స్‌’ నిందితుల అరెస్టు  | Sakshi
Sakshi News home page

‘ముత్తూట్‌ ఫైనాన్స్‌’ నిందితుల అరెస్టు 

Published Sun, Apr 22 2018 3:48 AM

Muthoot Finance accused arrested - Sakshi

హైదరాబాద్‌: దొంగతనాలనే వృత్తిగా చేసుకుని బతుకుతున్న మహారాష్ట్రకు చెందిన ముఠాను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ అశోక్‌కుమార్, ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్వర్, అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ హన్మంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన మహ్మద్‌ షరీఫ్‌ (35), హర్షద్‌ (28), సయ్యద్‌ షఫీయుద్దీన్‌ (30), అన్నా (35), సంతోష్‌ దశరథ్‌ వీర్కర్‌(35), మహ్మద్‌ ఫారూఖ్‌ (30), మహ్మద్‌ దస్తగిరి (55) ముఠాగా ఏర్పడ్డారు. దస్తగిరి చాంద్రయణగుట్ట బండ్లగూడ ప్రాంతంలో ఉంటూ పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వీరంతా హైదరాబాద్‌లో పలు దొంగతనాలు, దోపిడీ కేసుల్లో నిందితులుగా ఉండి జైలు శిక్ష సైతం అనుభవించారు.  

దోపిడీకి ప్లాన్‌ చేసి పరారీ: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో కిందటేడాది జూన్‌ 3న దోపిడీ చేసేందుకు ఈ ఏడుగురు నిందితులు పథకం పన్నారు. మహారాష్ట్రలో దొంగిలించిన టవేరా వాహనంలో వీరంతా ఆయుధాలతో మైలార్‌దేవ్‌పల్లికి చేరుకున్నారు. ప్లాన్‌ ప్రకారం ముత్తూట్‌ ఫైనాన్స్‌కు చేరుకోగా.. అందులో రద్దీ ఎక్కువగా ఉండటంతో మేనేజర్‌తో మాట్లాడి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మైలార్‌దేవ్‌పల్లిలో కలుసుకున్నారు.

ఆయుధాలతో వచ్చిన దుండగులు మేనేజర్‌తో గొడవపడి ఘర్షణ పడుతున్న సమయంలో సిబ్బంది అలర్ట్‌ అయి సైరన్‌ మోగించారు. దీంతో టవేరా వాహనంలో బయలుదేరి ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్‌లో వదిలి వెళ్లిపోయారు. కొంతకాలంగా మహారాష్ట్రకు చెందిన దొంగలను పట్టుకునేందుకు నిఘా ఏర్పాటు చేసిన పోలీసులకు చిక్కారు. ఈ ఏడుగురు నిందితుల్లో నలు గురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement