నారసింహా.. ఇదేమి లడ్డూ! | Sakshi
Sakshi News home page

నారసింహా.. ఇదేమి లడ్డూ!

Published Thu, May 22 2014 2:50 AM

narasimha swamy Temple facilities not fine

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి దివ్యప్రసాదమైన లడ్డూ, పులిహోర నాణ్యత రోజురోజుకూ కోల్పోతుంది. లడ్డూల్లోనుంచి నీరు గారుతోంది, పులిహోర.. దద్దోజనం మాదిరిగా ముద్దగా ఉంటోంది. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదాల తయారీలో దేవస్థానం అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
 యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొన్ని రోజలుగా లడ్డూ, పులిహోర ప్రసాదాల నాణ్యతను అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పులిహోర, లడ్డూలు పచ్చి ముద్దలుగా ఉండి అందులోనుంచి నీరు కారుతోంది. నాణ్యత లోపాలను సంబంధిత దేవస్థానం అధికారుల దృష్టికి వచ్చినా పట్టించుకోవడం లేదు.
 
 కాంట్రాక్టు పద్ధతిపై లడ్డూల తయారీ..
 యాదగిరిగుట్టలో లడ్డూ ప్రసాదాలను రెండు రకాలుగా తయారు చేస్తున్నారు. 50 రూపాయల లడ్డూ పెద్దది. దీనిని అభిషేకం లడ్డూ అంటారు. దీనిని 400 గ్రాములుగా తయారు చేస్తున్నారు. 10 రూపాయల లడ్డూ 100గ్రాములుగా  తయారు చేస్తున్నారు. వీటిని ప్రతిసారీ కాంట్రాక్టు పద్ధతిన దేవస్థానం తయారు చేస్తుంది. ఈ కాంట్రాక్టు పద్ధతి ఆరేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. అయితే కాంట్రాక్టర్లు ప్రసాదాల తయారీని వ్యాపారంగా మార్చేశారు.
 
 భక్తులకు పవిత్రంగా అందించే ప్రసాదంగా చూడడం లేదనేది ప్రధాన ఆరోపణ. కాంట్రాక్టుదారులు 10కిలోల దిట్టంలో 105 లడ్డూలను తయారు చేయాలనేది నిబంధన. కానీ కక్కుర్తి పడి కిలో దిట్టంలో నీటిశాతం ఎక్కువగా చేసి 130 లడ్డూలను త యారుచేసి అక్రమ ఆదాయానికి తెర తీస్తున్నారు. కిలో దిట్టంలో చిన్న లడ్డూలను 42 తయారు చేయాలి. కానీ 60 చిన్న లడ్డూలను తయారుచేస్తున్నారు. దీంతో ఈ లడ్డూలు పచ్చి ముద్దలుగా ఉండి  చేతిలో పట్టుకుంటే అందులోనుంచి నీరు పానకంలాగా కారుతుంది. కాంట్రాక్టర్లు భక్తులకు నాణ్యత లేని లడ్డూలను తయారు చేస్తున్నా దేవస్థానం అధికారులు  పట్టించుకోకపోగా సదరు కాంట్రాక్టరుకు తమదైన శైలిలో సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
 సిబ్బంది తక్కువ..
 లడ్డూల తయారీ కోసం 35మంది సిబ్బందిని నియమించాలి. కానీ ఇక్కడ కాంట్రాక్టు షెడ్యూల్‌లో ఉన్న దానికంటే 15మంది తక్కువా ఉన్నారు. 100 గ్రాముల లడ్డూ తయారీదారులు 20మంది, 400 గ్రాముల లడ్డూలను 15 మందితో తయారు చేయాలని నిబంధన విధించింది. అయినా కాంట్రాక్టుదారుల కక్కుర్తి బుద్ధితో కేవలం 20 మందితోనే తయారు చేస్తుండడంతో రద్దీ రోజులలో భక్తులకు పూర్తిస్థాయిలో ప్రసాదాలు అందడం లేదు.
 
 పచ్చి లడ్డూల తయారీ
 50 రూపాయల 400 గ్రాముల లడ్డూలను దేవస్థానం పచ్చివాటిని అమ్ముతుండడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఈ లడ్డూలు దద్దోజనం మాదిరిగా ఉంటున్నాయని వారంటున్నారు. అంతేగాక ప్రతిసారీ 50 రూపాయల లడ్డూలను స్వామి, అమ్మవారి చిత్ర పటాలు గల అందమైన డబ్బాలలో పెట్టి అమ్మేవారు.  కానీ వారం రోజులుగా డబ్బాలు స్టాక్ అయిపోవడంతో కవర్లలో ఉంచి ఇస్తుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లడ్డూలను తయారీదారులు నీటిని ఇష్టమొచ్చిన రీతిలో పోసి తయారు చేస్తున్నారని, దీంతో పచ్చిముద్దగా ఉంటాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 లడ్డూల దిట్టం ఇలా..
 కిలో దిట్టానికి  కిలో శనగ పిండి, 2 కిలోల చక్కెర, 600 గ్రాముల నెయ్యి, 75 గ్రాముల కాజు, 50గ్రాములు కిస్‌మిస్, 10గ్రాముల ఇలాచి పొడి సామగ్రిని దేవస్థానం..సదరు కాంట్రాక్టర్‌కు ఇస్తుంది. వారు అదనపు ఆదాయం కోసం దిట్టంలోని వస్తువులను తక్కువగా వాడి నాణ్యత లేని ఎక్కువ లడ్డూలను తయారు చేస్తున్నారు. కిలో దిట్టానికి పెద్దలడ్డూల తయారీకి రూ.12.50, చిన్న లడ్డూలకు రూ.11.50 కాంట్రాక్టర్‌కు చెల్లిస్తుంది. ఇటు వస్తువులు తక్కువగా వాడడం..అటు ఇచ్చిన వస్తువులతో ఎక్కువగా తయారు చేసి కాంట్రాక్టర్ రెండు రకాలుగా ఆదాయం పొందుతున్నాడు.
 
 నిద్రపోతున్న నిఘా వ్యవస్థ
 దేవస్థానంలోని ప్రసాదాల తయారీ విభాగంలో నిఘా నిద్రపోతుందన్న విమర్శలున్నాయి. రెండేళ్ల క్రితం ల డ్డూ తయారీ విభాగంలో,  ప్రసాదాల కౌంటర్ వద్ద రెం డు కెమెరాలను అమర్చారు. తయారీ విభాగంలోని కె మెరా పనిచేయడం లేదు. దీంతో తయారీదారులు ఇ ష్టానుసారంగా నీటిశాతం ఎక్కువ చేసి లడ్డూప్రసాదాలను తయారు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. కెమెరాల పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ఈఓ కూడా పట్టించుకోవడం లేదు. ప్రసాదాల విక్రయ కౌంటర్లు రెండు ఉండగా ఒకే కెమెరా ఉంది. ఒక్క కౌం టర్ పనితీరును మాత్రమే ఈ  కెమెరా తెలుపుతుంది.
 

Advertisement
Advertisement