ఎన్డీ దళ నాయకులుముగ్గురి అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

ఎన్డీ దళ నాయకులుముగ్గురి అరెస్ట్‌

Published Fri, Aug 31 2018 11:53 AM

ND Leaders In Police Custody - Sakshi

ఇల్లెందు ఖమ్మం : ఎన్డీ రాయల వర్గం దళ నేత సంగపొంగు ముత్తయ్య అలియాస్‌ పుల్లన్నను, ఆయన భార్య జయను, మరో దళ సభ్యుడు కృష్ణను మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పెద్దఎల్లాపురంలో పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. 

ఇరవయ్యేళ్లుగా అజ్ఞాతంలోనే... 

బయ్యారం మండలం ఇర్సులాపురం గ్రామానికి చెందిన సంగపొంగు ముత్తయ్య అలియాస్‌ పుల్లన్న.. 1996లో ఎన్డీ ప్రజాప్రతిఘటన అజ్ఞాత దళంలో చేరాడు. ఇల్లెందు ఏరియా, పాఖాల కొత్తగూడ, దుబ్బగూడెం ఏరియా దళాల నేతగా పనిచేశారు. 2012–13లో ఎన్డీలో చీలిక తరువాత చంద్రన్న వర్గంలోకి వెళ్లారు. కొన్నాళ్లకే రాయల గూటికి వచ్చారు. మహబూబాబాద్‌ జిల్లాలో కీలక నేతలు అరెస్టవడంతో జిల్లా ఇన్‌చార్జ్‌ బాధ్యతలను పుల్లన్న నిర్వహిస్తున్నట్టు తెలిసింది. 

వరుస అరెస్టులు 

న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ అగ్ర నేతలందరినీ పోలీసులు వరుసగా అరెస్ట్‌ చేస్తున్నారు. ఈ ఏడాదిలో రాష్ట్ర నాయకుడు ఆవునూరి నారాయణస్వామి (మధు) రెండుసార్లు అరెస్టయ్యారు. దనసరి సమ్మయ్య(గోపి), పూనెం లింగయ్య(లింగన్న), యదళ్లపల్లి విశ్వనాధం(ఆజాద్‌), కొమురం వెంకటేశ్లర్లు(గణేష్‌) అరెస్టయ్యారు. ఆ తర్వాత చాలామందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వీరిలో ఆజాద్‌ బయటికొచ్చిన తరువాత తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లారు. గణేష్‌ కూడా విడుదలయ్యాడు. ఆయన మాత్రం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎన్డీ చంద్రన్న వర్గం నాయకులు సురేష్, ప్రతాప్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Advertisement
Advertisement