⇒ స్పష్టం చేసిన రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా
⇒ ప్రభుత్వ వ్యతిరేక శక్తులను కూడగడతా: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలపట్ల అధిష్టానం సంతృప్తిగా ఉన్నదని, 2019 ఎన్నికల్లోనూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క నాయకత్వమే ఉంటుందని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి రామ చంద్ర కుంతియా చెప్పారు. శుక్రవారం ఇక్కడ జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కుంతియా మాట్లాడు తూ హైదరాబాద్లో పార్టీ ఇంకా పటిష్టం కావాలని, పోలింగ్ బూత్ స్థాయి దాకా పార్టీ కమిటీలను పూర్తి చేయాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ అధికార టీఆర్ఎస్ నేతల అహంకారాన్ని మేధావులు, ప్రజలు సహిం చలేకపోతున్నారని అన్నారు. సభ్యసమాజం ఉపయోగించని భాషను టీఆర్ఎస్ నేతలు వాడుతున్నారని అన్నారు.
ప్రజలకు, సామా న్యులకు ఉపయోగపడే అభివృద్ధి పనులు చేయకుండా కేవలం ప్రచారార్భాటానికే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పరిమితమయ్యారని విమర్శిం చారు. టీఆర్ఎస్కు పతనం మొదలైందని హెచ్చరించారు. లక్షలాది రూపాయల అప్పు చేసి పండిం చిన పంటలకు ధరలేక, కొనేవాడు లేక రైతులు రోడ్డు మీద పడి ఆవేదన చెందుతుంటే, ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడంలేదని ఆయన విమర్శిం చారు. చెప్పుకోదగిన అభివృద్ధి పనులు ఏమీలేకపోవడంతో ప్రతిపక్షాలను దూషిం చడానికే టీఆర్ఎస్ నేతలు పరిమిత మయ్యారని అన్నారు.
హైదరాబాద్లోని ధర్నాచౌక్ను తీసేయడం సీఎం కేసీఆర్ నియంతృత్వ, అప్రజాస్వామిక ధోరణికి పరాకాష్ట అని ఉత్తమ్ విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అన్ని శక్తులను కూడగట్టి ప్రజల్లో వెళ్తామని, ప్రభుత్వ ప్రచారంలోని వాస్తవాలు, అవాస్తవాలను ప్రజలకు చెబుతామని అన్నారు. ధర్నాచౌక్ను ఎత్తివేయడానికి నిరసనగా ట్యాంక్బండ్ అంబేడ్కర్ విగ్రహం దగ్గర ఈ నెల 17న సత్యాగ్రహం చేస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ కుటుంబాన్ని జనం పొగడడంలేదని, అందుకే ఆయన కుటుంబసభ్యులు ఒకరినొకరు పొగుడుకుంటున్నారని కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ ఎద్దేవా చేశారు.
రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎన్నికలు జరగడం వల్ల ప్రజలు క్షణికావేశంలో టీఆర్ఎస్కు ఓట్లేశారని అన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఊహించని విధంగా నిరసనలు ఉంటాయని, ఏ పరిణామం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని మాజీమంత్రి దానం నాగేందర్ హెచ్చరిం చారు. ధర్నాచౌక్పై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే హోంమంత్రి ఇంటిని, డీజీపీ, నగర పోలీసు కమిషనర్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చ రించారు. సమావేశంలో పార్టీ నేతలు మర్రి శశిధర్రెడ్డి, అంజన్కుమార్ యాదవ్, జి.నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.