అక్రమాలకు నిలయమైన నిమ్స్ | Sakshi
Sakshi News home page

అక్రమాలకు నిలయమైన నిమ్స్

Published Sun, May 18 2014 1:21 AM

అక్రమాలకు నిలయమైన నిమ్స్

  • ఆస్పత్రి అకౌంట్స్ నిర్వహణపై ఆడిట్ విభాగం అభ్యంతరం
  •  వైద్య పరికరాల కొనుగోళ్లు, నిర్మాణపు పనుల్లో అవినీతే కారణం
  •  సాక్షి, సిటీబ్యూరో : గత కొంతకాలంగా ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) అవినీతికి నిలయంగా మారింది. కొంతమంది అధికారులు రోగుల సొమ్మును పందికొక్కుల్లా మింగేస్తున్నారు. కొత్త భవనాల నిర్మాణం, వైద్య పరికరాల కొనుగోళ్లు, అకౌంట్స్ నిర్వహణ, బకాయిల వ సూళ్లు, చెల్లింపుల్లో భారీఎత్తున అక్రమాలు జరిగాయి.

    ప్రభుత్వ అనుమతి లేకుండా, కనీసం టెండర్ కూడా పిలవకుండానే ఇష్టం వచ్చినట్లు నిర్మాణపు పనులు కేటాయించడం, వైద్య పరికరాలు కొనుగోలు చేయడం వల్ల ఆస్పత్రికోట్లాది రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. గత 13 నెలల నుంచి ఆస్పత్రి ఆదాయ, వ్యయాలపై ఆడిట్స్ నిర్వహించకపోగా, ఫైనాన్స్ కంట్రోలర్ శ్రీధర్ ప్రభుత్వానికి సమర్పించిన బిల్లుల్లో అన్ని లోపాలే ఉన్నట్లు విజిలెన్స్ విభాగం స్పష్టం చేసింది.
     
    అన్ని అవకతవకలే...

    బీబీనగర్‌లో రూ.93 కోట్లతో, నిమ్స్‌లో రూ.100 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ, ట్రామాకేర్ బ్లాక్‌లను నిర్మించారు. రూ.3 కోట్లతో మిలీ నియం బ్లాక్ నిర్మించారు. మిలీనియం బ్లాక్‌తో పాటు బీబీనగర్ నిమ్స్ నిర్మాణపు పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. సూపర్ స్పెషాలిటీ, ట్రామా బ్లాక్ నిర్మాణ సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా టెండర్‌లో ఐదు శాతం ఎక్కువ కోడ్ చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది.

    అప్పటి డెరైక్టర్ ప్రసాదరావు, డిప్యూటీ డెరైక్టర్ కేటీరెడ్డి, ఫైనాన్సియల్ కంట్రోలర్ శ్రీధర్, టెక్నికల్ అడ్వైజర్ మజారుద్దీన్, ఇంజనీర్ సమ్‌దానీలపై అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్పష్టం చేయాలని ఇటీవల ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరైన నిమ్స్ అధికారులను న్యాయమూర్తి ప్రశ్నించడం విశేషం. ఈ మేరకు ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఇదే అంశాన్ని ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.
     
    ఫైనాన్స్ కంట్రోలర్ శ్రీధర్‌పై వేటు

    నిమ్స్ ఫైనాన్స్ కంట్రోలర్ శ్రీధర్‌పై ఆస్పత్రి యాజమాన్యం శనివారం వేటు వేసింది. విధి నిర్వహణలో అలసత్వం, రికార్డుల నిర్వ హణ, అకౌంట్స్, ఆడిటింగ్‌లో లోపాలకు ఆయన్ను బాధ్యుడిని చేస్తూ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ప్రభుత్వానికి ఆయన పంపిన ఆడిట్స్‌పై విజిలెన్స్ విభాగం అనేక అభ్యంతరాలు చెప్పడంతో పాటు ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడం వల్లే ఈ పని చేయాల్సి వచ్చిందని నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాధ్ స్పష్టం చేశారు.
     

Advertisement
Advertisement