పాత కక్షలతోనే | Sakshi
Sakshi News home page

పాత కక్షలతోనే

Published Thu, Dec 4 2014 3:55 AM

old faction

 నూతనకల్ : చిన్నపాటి ఘర్షణ చినికి.. చినికి గాలివానలా మారి ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. నూతన్‌కల్ మండలం మద్దిరాల గ్రామంలో టీడీపీ వర్గీయులచే దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీఆర్‌ఎస్ కార్యకర్త బుధవారం మృతిచెందాడు. పాతకక్షలను మనసులో పెట్టుకునే ఉమేష్‌పై దాడి జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. గ్రామానికి చెందిన భూతం శంభయ్య, ఉమేష్‌లు  తమ స్నేహితుడైన భూతం లింగరాజు ఇంట్లో మంగళవారం రాత్రి టీవీ చూస్తున్నారు. ఈ క్రమంలో లింగరాజుకు అతడి తమ్ముడు ఫోన్ చేయగా బయటికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో ఇంటి ఎదురుగా ఉన్న టీడీపీ కార్యకర్త భూతం వెంకన్న అలియాస్ చలం నీ ఇంట్లో ఎవరూ ఉన్నారని లింగరాజును అడిగాడు.
 
 ఉమేష్(25), శంభయ్య టీవీ చూస్తున్నారని పేర్కొన్నాడు. వారిని బయటికి పంపించాలని, లేకుం టే గొడవలు జరుగుతాయని  వెంకన్న హెచ్చరిస్తూ లింగరాజు వద్ద ఉన్న సెల్‌ఫోన్ లాక్కున్నాడు. దీంతో భయాందోళనకు గురైన లింగరాజు ఇంట్లోకి వెళ్లి టీవీ చూస్తున్న వారిని బయటకి పంపించాడు. ఇంటికి వెళ్తున్న శంభయ్యను  భూతం లింగయ్య మరికొందరు పట్టుకోవడానికి ప్రయత్నించగా అతడు వదలాయిం చుకుని పారిపోయాడు. వెనుకే ఉన్న ఉమేష్‌ను టీడీపీకి చెందిన వడ్డెనం యతిరాజారావుతో పాటు మరికొంద రు కలిసి పట్టుకున్నారు. అతడిని చర్చి సమీపంలోకి తీసుకెళ్లి బండరాయితో తలపై మోది,  మరణాయుధాలతో దాడి చేయగా తీవ్ర గాయాలపాలయ్యాడు. రక్తపు మడుగులో పడిఉన్న ఉమేష్‌ను స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతిచెందాడు.
 
 వైరానికి ఆనాడే బీజం
 టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైభవంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో టీడీపీ, అధికారపార్టీ కార్యకర్తల మధ్య వైరానికి బీజం పడినట్టు తెలుస్తోంది. సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మలను నిమజ్జనం చేసే చోట టీఆర్‌ఎస్ కార్యకర్తలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు డీజే ఏర్పాటు చేయడంతో పాటు తమ పార్టీ నేతల ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. వీరితో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రెండు పార్టీల కార్యకర్తలు ఫ్లెక్సీల విషయంలో గొడవపడి ఒకరి ఫ్లెక్సీని మరొకరు తొలగించుకున్నా రు. దీంతో గత అక్టోబర్ 10వ తేదీన టీఆర్‌ఎస్ కార్యకర్తలు టీడీపీ మండల నాయకుడు యతిరాజారావుపై దాడి చేశారు. ఈ కేసులో ఉమేష్ ఏ3 నిందితుడుగా ఉన్నాడు. అప్పటి నుంచి గ్రామంలో రాజకీయ వైరం బలపడిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గియులు ఉమేష్‌పై దాడిచేసి ఉండవచ్చని భావిస్తున్నారు.
 
 జీవనోపాధికి వరంగల్‌కు..
 మృతుడు ఉమేష్ జీవనోపాధి కోసం వరంగల్ జిల్లా చిన్ననాగారం గ్రామానికి దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం వలసవెళ్లాడు. మృతుడి మేనమామ, బావ ఆత్మకూర్ (ఎస్) మండల పాత సూర్యాపేట గ్రామం తన్నీరు ఉపేందర్ ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఇదే క్రమంలో దసరా పండగకు వచ్చి టీడీపీ వర్గీయులతో ఘర్షణ పడి వెళ్లాడు.  తిరిగి మంగళవారం ఉదయం మద్దిరాలకు చేరుకుని హత్యకు గురయ్యాడు. మృతుడికి భార్య,కుమారుడు, కుమార్తె ఉన్నారు.
 
 మంత్రి పరామర్శ
 సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మృతిచెందిన ఉమేష్ కుటుంబ సభ్యులను రాష్ట్ర విద్యాశా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పరామర్శించారు. ఉమేష్ మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. ఘటన గురించి వివరాలు అడిగితెలుసుకున్నారు. మృ తుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
 
 గ్రామంలో పోలీసుల బందోబస్తు
 ఉమేష్ మృతితో గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు  బందోబస్తు ఏర్పాటు చేశారు.  మృతుడి స్నేహితుడు భూతం శంభ య్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుంగతుర్తి సీఐ ఎం.రాజాగంగరాం పర్యవేక్షణలో ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేశారు. సూర్యాపేట డీఎస్పీ ఎస్‌కె.రషీద్ ఆధ్వర్యంలో హాలియా సీఐ పార్థసారథి, అర్వపల్లి, తిరుమలగిరి ఎస్సైలు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

 

Advertisement
Advertisement