పోలీస్‌లకే ‘ప్రజావాణి’ | Sakshi
Sakshi News home page

పోలీస్‌లకే ‘ప్రజావాణి’

Published Tue, Aug 25 2015 4:58 AM

పోలీస్‌లకే ‘ప్రజావాణి’

- ప్రజావాణిపై అధికారులు నిర్లక్ష్యం
- డీఆర్వో కార్యాలయం గేట్లకు తాళాలు
- దరఖాస్తులు తీసుకున్న పోలీస్ సిబ్బంది
హన్మకొండ అర్బన్ :
ప్రజావాణి నిర్వాహణలో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. వందల కి లోమీటర్ల దూరం నుంచి జనం తమ బాధలు చెప్పుకునేందుకు వస్తే డీఆర్వో కార్యాలయంలో అధికారులు తలుపులకు తాళాలు వేసుకుని జనాన్ని గంటల కొద్దీ నిలబెట్టారు. ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజలనుంచి డీఆర్వో, రిటైర్డ్స్ ఎస్‌డీసీ ప్రసాద్‌రావు  వినతులు స్వీకరించారు. గత రెండు వారాలుగా ప్రజావాణి లేక పోవడంతో ఈ సారి జనం ప్రజావాణికి పోటెత్తారు.

సుదూర ప్రాంతాలనుంచి ఉన్నతాధికారులకు తమ గోడు వెళ్ల బోసుకుందామని కలెక్టరేట్‌కు జనం వ స్తే అధికారులు మాత్రం జనం సహనానికి పరీక్ష పెట్టారు. వచ్చిన దరఖాస్తును నమోదు చేసుకునేందుకు డీఆర్వో కార్యాలయం వద్ద ఒక్కొకరిని సుమారు మూడు గంటలపాటు నిలబెట్టారు. వారినుంచి దరఖాస్తులు తీసుకునేవారు లేరు. ఒక తరుణంలో జనం అధికారులతో వాగ్వాదానికి దిగారు. వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడి అధికారుల తీరును తీవ్రంగా నిరసించారు. జనం ఆందోళన ఉధృతం అవుతుండటంతో అక్కడ కాపలాగా ఉన్న పోలీస్ సిబ్బంది జనం నుంచి దరఖాస్తులన్నీ సేకరించి కుప్పపోశారు. ఇప్పటికైనా అధికారులు ప్రయోగాలు మాని ఒక పద్ధతి ప్రకారం ప్రజావాణి నిర్వహించాలని జనం కోరుతున్నారు.

Advertisement
Advertisement