ఆయన అబద్ధాలు శృతిమించుతున్నాయి.. | Sakshi
Sakshi News home page

ఆయన అబద్ధాలు శృతిమించుతున్నాయి..

Published Sun, Jul 9 2017 5:39 PM

ఆయన అబద్ధాలు శృతిమించుతున్నాయి..

హైదరాబాద్‌: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అబద్దాలు శృతి మించుతున్నాయని ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ..పులిచింతలపై ఉత్తమ్ మాట్లాడుతున్నవన్నీ అబద్దాలేనని స్పష్టం చేశారు. ఉత్తమ్ చెప్పిన దాంట్లో పులిచింతల హుజుర్‌ నగర్‌లో ఉందనేది మాత్రమే నిజమన్నారు. 2006లో పులిచింతల హైడల్ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు వచ్చినా కాంగ్రెస్ హాయంలో తట్టెడు మన్ను కూడా తీయలేదన్నారు. అపుడు ఆంధ్రా సీఎంలకు భయపడి ఉత్తమ్ లాంటి వారు పులిచింతలపై మాట్లాడలేదన్నారు.

కేసీఆర్ సీఎం అయ్యాకే 2015లో పులిచింతల హైడల్ ప్రాజెక్టు డీపీఆర్‌ 563 కోట్ల రూపాయలతో రూపొందిందని తెలిపారు. కేసీఆర్ చొరవతోనే విద్యుత్ ప్రాజెక్టులు వేగిరంగా పూర్తవుతున్నాయని చెప్పారు. భూపాలపల్లి , కడప థర్మల్ ప్లాంట్లు ఒకేసారి మొదలయ్యాయి..భూపాలపల్లి పూర్తయితే కడప ప్లాంటు ఎందుకు పూర్తి కాలేదో కాంగ్రెస్ నేతలు చెప్పాలని కోరారు. ప్రాజెక్టులను ఆపేందుకు కాంగ్రెస్ నేతలు ట్రిబ్యునళ్ల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

అరవై సంవత్సరాల్లో కాంగ్రెస్‌ ఆరు వేల మెగావాట్ల కరెంటు యిస్తే గత మూడేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 12 వేల మెగావాట్ల కరెంటు ఇచ్చిందని స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రం లో విద్యుత్ ఉత్పాదనను 28 వేల మెగావాట్లకు పెంచుతామన్నారు.మేము విద్యుత్ పై చెప్పిన గణాంకాలు తప్పుంటే ఉత్తమ్ బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. విద్యుత్ పై కాంగ్రెస్ నేతలు అబద్దాలు ఆడటం మానుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement