వామ్మో కరోనా: ఆస్పత్రి నుంచి పరారైన పేషెంట్‌ | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి నుంచి పారిపోయిన పేషెంట్‌

Published Sat, Mar 7 2020 5:50 PM

Patient Missing From Hospital Suffering With Corona Symptoms - Sakshi

సాక్షి, నిర్మల్‌ : నిర్మల్ జిల్లాలో కరోనా అనుమానిత కేసు కలకలం రేపింది. మండలంలోని ముజిగి గ్రామానికి చెందిన తోట మహిపాల్ అనే వ్యక్తి 15 రోజుల క్రితం దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. అయితే గత నాలుగు రోజులుగా తీవ్రమైన జలుబు, వాంతులు, దగ్గుతో బాధపడుతున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మహిపాల్‌ను పరిక్షించిన డాక్టర్ రాజేందర్.. ఆయనకు కరోనా వైరస్‌కు సంబంధించిన లక్షణాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మెరుగైన చికిత్స కోసం శనివారం ఉదయం.. నిర్మల్ ఏరియా హాస్పిటల్‌కు రిఫర్ చేశారు.

ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో మహిపాల్‌ను నిర్మల్‌ వైద్యులు పరిశీలించి ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. కొంత సమయం తరువాత అతని పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు తరలించాలని వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు హాస్పిటల్ సిబ్బంది బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధం చేస్తుండగా హాస్పిటల్ నుంచి కనిపించకుండా పారిపోయాడు. ప్రస్తుతం అతడు ఎక్కడున్నాడో జాడ తెలియడం లేదు. అతని కోసం కుటుంబ సభ్యులతో పాటు ఆస్పత్రి సిబ్బంది అన్వేషిస్తున్నారు. కరోనా వైరస్‌ సోకిందనే భయంతోనే ఆయన ఆస్పత్రి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement