కదంతొక్కిన బీడీ కార్మికులు | Sakshi
Sakshi News home page

కదంతొక్కిన బీడీ కార్మికులు

Published Sun, Dec 28 2014 12:58 AM

pay thousand rupees for beedi workers

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీడీ కార్మికులు కదంతొక్కారు. మామడ, జన్నారంలో ర్యాలీలు చేపట్టి నిరసనలు చేపట్టారు. తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలకు దిగారు. మామడలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రూ.వెయ్యి జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పందించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.                

నిర్మల్(మామడ)/జన్నారం : సమస్యల పరిష్కారం కోసం బీడీ కార్మికులు కదంతొక్కారు. శనివారం మామడ, జన్నారం మండల కేంద్రాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. మామడలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళలు భారీ సంఖ్యలో ర్యాలీగా బస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు తరలివెళ్లారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలో ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కార్మికులకు రూ.వెయ్యి జీవనభృతి చెల్లించాలని అన్నారు. సమస్యలు పరిష్కారానికి నోచుకోక రాష్ట్రంలోని ఏడు లక్షల మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యలు పరిష్కరించనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పనిదినాలు పెంచాలని అన్నారు. అనతరం ఆర్‌ఐ చిన్నయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడివర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బక్కన్న, ప్రధాన కార్యదర్శి రాజన్న, నాయకులు రాంలక్ష్మణ్, గంగన్న, గపూర్, సుమేష్, నంది రామయ్య పాల్గొన్నారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో..
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు రూ. వెయ్యి భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ జన్నారంలో శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూతన్‌కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని విడుదల చేయకపోవడం విడ్డూరమని అన్నారు.

కార్మికులకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, కనీస వేతన చట్టం జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు.  అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ సంపతి శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రాజన్న, మండల కార్యదర్శి కే.లింగన్న, సీఐటీయూ నాయకులు కూకటికారు బుచ్చన్న, పిల్లి అంజయ్య, అలగొండ శాంత, సిందెం స్వరూ ప, సుమారు వెయ్యి మంది బీడీ  కార్మికులు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement