ప్రజలను అవమానిస్తే గుణపాఠం తప్పదు | Sakshi
Sakshi News home page

ప్రజలను అవమానిస్తే గుణపాఠం తప్పదు

Published Sun, Oct 19 2014 1:51 AM

ponnala takes on kcr

 కేసీఆర్‌కు పొన్నాల హెచ్చరిక

 సాక్షి, హైదరాబాద్: ప్రజలను అవమానపరిచి, ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే, వారి చేతిలో  సీఎం కేసీఆర్‌కు గుణపాఠ ం తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనుభవరాహిత్యం,అవగాహనాలేమితో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, పాలకులు ఏమీ పట్టనట్టు వ్యవహరించడం దారుణమన్నారు.  రైతులు, పేదలు,విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు, అణగారిన వర్గాలు ఇలా అన్ని వర్గాలకు ప్రభుత్వం వ్యతిరేకి అనేది స్పష్టమవుతోందన్నారు. బంగారు తెలంగాణ, ఆత్మగౌరవపాలన అంటే, ఇదేనా ? అని ఆయన నిలదీశారు. ఇప్పటికైనా పద్ధతిని మార్చుకుని ప్రజలను గౌరవించి, విపక్షాల విలువైన సలహాలను తీసుకోవాలని హితవుపలికారు. సంక్షేమపథకాల పేరిట ప్రభుత్వం చేస్తున్న ప్రయోగాలు ప్రజలను అవమానించేందుకే ఉపయోగపడుతున్నాయన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన కుల,ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఏ విధంగా చెల్లకుండా పోతాయన్నారు. పేదలను దొంగలుగా చిత్రించే ప్రయత్నం జరుగుతున్నదన్నారు. ప్రజలకు అవసరమైనవి గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం చేస్తున్న వింతచేష్టల వల్ల వికలాంగులు,వృద్ధులు, వితంతువులు, మహిళలు, విద్యార్థులు , ఉద్యోగులు ఇలా కోట్లాదిమంది ఇబ్బందిపడుతున్నారని పొన్నాల ధ్వజమెత్తారు. ఇప్పుడు అవసరం లేని వాటర్‌గ్రిడ్ గురించి, మూసీప్రక్షాళన గురించి గంటల తరబడి సమీక్షలు, పర్యటనలు చేస్తున్న సీఎం ఒక్కసారైనా గ్రామాలకు వెళ్లి రైతుల సమస్యలు, కరెంట్‌కోత, దరఖాస్తు దారుల వెతలు, వాస్తవాలు గమనించాలన్నారు.
 

Advertisement
Advertisement