హైదరాబాద్ : సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటుపై తొందర పడుతున్నారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై లక్షకుపైగా వచ్చిన అభ్యంతరాలను పరిశీలించకపోవడం అన్యాయమని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. లక్షకుపైగా ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్ మాట తప్పారని పొన్నం విమర్శించారు.
ఇష్టానుసారంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం మంచిదికాదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాల ఏర్పాటును సమీక్షిస్తుందని పొన్నం పేర్కొన్నారు. జిల్లాల వారీగా అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలను, కొత్త రెవెన్యూ డివిజన్లు ప్రజాభిప్రాయం మేరకే ఎంపిక చేయాలని పొన్నం ప్రభాకర్ సూచించారు.