ప్రసవ వేదనతో గర్భిణి మృతి | Sakshi
Sakshi News home page

ప్రసవ వేదనతో గర్భిణి మృతి

Published Tue, Aug 28 2018 2:20 AM

Pregnant death due to childbirth - Sakshi

ఆసిఫాబాద్‌ రూరల్‌: సరైన వైద్య సదుపాయం అందక ప్రసవ వేదనతో నిండు గర్భిణి మృతి చెందిన విషాదకర ఘటన ఇది. సమయానికి అంబులెన్స్‌ రాకపోవడంతో ఆటోలో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రక్తస్త్రావం కావడంతో మృతిచెందింది. సోమవారం కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌ మండలం రౌటసంకెపల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కొడప గంగ (24)కు పురిటి నొప్పులు రావడంతో 108కు ఫోన్‌ చేశారు. అయితే జిల్లాలో సిబ్బంది సమ్మెలో ఉండటంతో వాహనం రాలేదు.

పురిటి నొప్పులు అధికంగా కాగా భర్త శేఖర్‌ ఆటోలో గంగను తీసుకుని ఆస్పత్రికి బయలుదేరాడు. కొంతదూరం వెళ్లేసరికి అధిక రక్తస్రావం కావడంతో పిండం బయటపడి గంగ అక్కడికక్కడే మృతి చెందింది. జిల్లాలో సరైన వైద్య సదుపాయం లేక..ఉన్నా వైద్యులు పట్టించుకోక నిండు గర్భిణుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో జిల్లాలో ఇది ఆరో ఘటన కావడం గమనార్హం. 

Advertisement
Advertisement